లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేయకుండా తమను అడ్డుకున్నారంటూ రాయ్గంజ్ నియోజకవర్గ పరిధిలోని దినాజ్పూర్ జిల్లాలో కొందరు నేషనల్ హైవేపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. దినాజ్పూర్ జిల్లాలోని ఇస్లాంపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
చోప్రాలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన తమను ఓటు వేయకుండా అడ్డుకున్నారని, తృణమూల్ కాంగ్రెస్ నేతలు పోలింగ్ బూత్ను తమ అధీనంలోకి తీసుకున్నారని స్థానికులు ఆరోపించారు. 34వ నంబరు నేషనల్ హైవేపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వారికి సర్దిచెప్పేందుకు వచ్చిన పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. భాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఓటర్లకు పూర్తి భద్రత కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
ఇస్లాంపూర్లోని మరో పోలింగ్ కేంద్రం సమీపంలో సీపీఎం ఎంపీ అభ్యర్థి మహమద్ సలీమ్ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద రిగ్గింగ్ జరుగుతోందనే సమాచారం రావడంతో తాను అక్కడకు వెళ్లానని.. అదే సమయంలో కొందరు వ్యక్తులు తన కారుపై రాళ్లతో దాడి చేశారని మహమద్ సలీమ్ తెలిపారు. అదృష్టవశాత్తు తనకు ఎలాంటి హానీ జరుగలేదన్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్కు చెందిన వ్యక్తులే దాడి చేసి ఉంటారని ఆరోపించారు. రాయ్గంజ్ నుంచి సీపీఎం తరపున మహ్మద్ సలీమ్ బరిలో ఉన్నారు.