Lashkar Commander : కశ్మీర్ లో ఎన్ కౌంటర్..లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం
జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్ లో సోమవారం భద్రతా దళాలు- ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తొయిబా ఆధ్వర్యంలో నడిచే ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF)కి చెందిన టాప్ కమాండర్లు
- venkaiahnaidu
- Published On : August 23, 2021 / 09:43 PM IST
Kashmir (2)
Lashkar Commander జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్ లో సోమవారం భద్రతా దళాలు- ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తొయిబా ఆధ్వర్యంలో నడిచే ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF)కి చెందిన టాప్ కమాండర్లు ఇద్దరు హతమయ్యారు. మృతులు టీఆర్ఎఫ్ చీఫ్ అబ్బాస్ షేక్, అతడి సహచరుడు సాకిబ్ మంజూర్ అని కశ్మీర్ ఐజీపీ తెలిపారు. ఈ ఆపరేషన్ భద్రతా బలగాలకు దక్కిన భారీ విజయమని అన్నారు.
వీరిద్దరి ఆచూకీపై అందిన సమాచారంతో అలూచీ బాగ్లో ఆపరేషన్ చేపట్టినట్లు విజయ్ కుమార్ తెలిపారు. పది మంది జవాన్లు సాధారణ దుస్తులలో వెళ్లి వారిని చుట్టుముట్టారని, ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. ప్రతిగా బలగాలు సైతం కాల్పులు చేయగా.. ఉగ్రవాదులు ఇద్దరు మరణించారని తెలిపారు.
కాగా,గతంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ తో కలిసి పనిచేసిన అబ్బాస్ షేక్..రెండేళ్ల క్రితమే టీఆర్ఎఫ్ లోకి వచ్చాడు. ఇక,మన్సూర్..గతేడాది టీఆర్ఎఫ్ లో చేరేనాటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి. శ్రీనగర్ లో మరియు సీటీ బయట జరిగిన పలువురి హత్యల్లో వీరిద్దరి ప్రమేయం ఉందని..ఉగ్రవాదంలో చేరేలా యువతను ఉసిగొల్పుతున్నారని విజయ్ కుమార్ తెలిపారు.
అయితే తమ పిల్లలు ఉగ్రవాదులతో చేరకుండా నిరోధించాలని తాము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని.. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా చేరినట్లయితే, దయచేసి వారిని తిరిగి జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలని..తాము వారిని స్వాగతిస్తామని విజయ్ కుమార్ అన్నారు.
