tv, mobile phones, led bulbs, ac, refrigerator prices to hike: ఇప్పటికే పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. గ్యాస్ బండ ధర గుదిబండగా మారింది. నిత్యావసర సరుకుల రేట్లు చుక్కలను తాకుతున్నాయి. వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. టీవీ ధరలకు రెక్కలు వచ్చాయి. వరుసగా అన్నింటి ధరలు పెరుగుతుడంటంతో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. బతుకు భారంగా మారింది. ఇప్పుడు మరో షాక్ తగలనుంది. ఏసీలు, ఫ్రిడ్జ్ లు, టీవీలు, ఎల్ఈడీ బల్బులు, మొబైల్ ఫోన్ల ధరలు కూడా పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.
దిగుమతి చేసుకునే విడిభాగాలపై కేంద్రం 2021-22 బడ్జెట్ లో కస్టమ్ డ్యూటీ పెంచిన విషయం విదితమే. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. మొత్తం కలిపి కనీసం 3 నుంచి 5శాతం వరకు ధర పెరగొచ్చు. మరోవైపు అల్యూమినియం, స్టీల్ లాంటి ఇన్ పుట్ మెటీరియల్ చార్జీలు పెరుగుతున్నాయి. రవాణ చార్జీలు భారంగా మారాయి. కాబట్టి ధరల పోటు తప్పదు. సో, ఏమైనా కొనాలని ఉంటే.. మార్చి 31లోపే కొనేయడం బెటర్. లేదంటే అదనపు భారం తప్పదు.
టీవీల విషయానికి వస్తే ఒక్కో దానిపై 2 నుంచి 3 వేల వరకు ధర పెరిగే చాన్సుంది. ఇక ఈ వేసవి కాలంలో అత్యధికంగా వినియోగించేవి ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజరేటర్లు అన్న సంగతి తెలిసిందే. వాటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీన్ని సొమ్ము చేసుకోవడానికి కంపెనీలు రెడీ అయ్యాయి. ఏసీలు, ఫ్రిడ్జ్ ల ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.
తయారీ వ్యయాలు పెరగడంతో కొన్ని కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచగా, మరికొన్ని 3-8 శాతం వరకు పెంచాలని భావిస్తున్నాయి. ఇప్పుడే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటం, ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచి పని కొనసాగుతుండటం వల్ల ఈ ఏడాది ఏసీల అమ్మకాల్లో అధిక రెండంకెల వృద్ధి నమోదు కావొచ్చని వోల్టాస్, దైకిన్, ఎల్జీ, బ్లూస్టార్, శామ్సంగ్, పానసోనిక్, హయర్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి.