భారత్-పాక్ “రహస్య” శాంతి ప్రణాళిక వెనుక UAE మధ్యవర్తిత్వం
జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి ఇకనుంచి కాల్పులు జరుపుకోకూడదని గత నెలలో భారత్-పాక్ దేశాల సైన్యాలు పరస్పర అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో... భారత్, పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవోలు) మధ్య హాట్ లైన్ ద్వారా చర్చలు జరిగాయి.
- venkaiahnaidu
- Published On : March 22, 2021 / 06:29 PM IST
Uae Brokered Secret Peace Plan Between India Pakistan Report
UAE brokered జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి ఇకనుంచి కాల్పులు జరుపుకోకూడదని గత నెలలో భారత్-పాక్ దేశాల సైన్యాలు పరస్పర అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో… భారత్, పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవోలు) మధ్య హాట్ లైన్ ద్వారా చర్చలు జరిగాయి. 2003నాటి కాల్పుల విరమణ ఒప్పందం పక్కాగా అమలయ్యేలా ఇరు దేశాల సైన్యం ఈ సందర్భంగా ఓ పరస్పర అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే
అయితే, దాయాది దేశాలు సడెన్గా ఇలా కాల్పుల విరమణ గురించి మాట్లాడటం ఏంటన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇండియా, పాకిస్తాన్ మధ్య కొన్ని నెలలుగా రహస్య చర్చలు జరుగుతున్నాయని, వీటికి యూఏఈ మధ్యవర్తిత్వం వహించినట్లు తాజా సమాచారం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మధ్యవర్తిత్వంతో ఇదంతా జరుగుతున్నదని విశ్వసనీయ వర్గాలను కోట్ చేస్తూ ప్రఖ్యాత బ్లూమ్స్ బర్గ్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత్-పాక్ సైన్యాల మధ్య శాంతి ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయేద్ (ఫిబ్రవరి 26న) ఢిల్లీకి విచ్చేసి, మన విదేశాంగ మంత్రి జైశకంర్ తో భేటీ అయ్యారు. ముందస్తు అజెండా లేకుండా సాగిన ఆ భేటీకి సంబంధించి.. రెండు దేశాల ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారాలను చర్చించారనే రొటీన్ ప్రకటన వెలువడగా, తెరవెనుక మాత్రం పెద్ద మంత్రాంగమే సాగింది.
కాల్పుల విరమణ అన్నది ప్రారంభమే అని, రానున్న రోజుల్లో రెండు దేశాల మధ్య శాంతి నెలకొనే అనేక చర్యలు చేపట్టబోతున్నట్లు బ్లూమ్బర్గ్ రిపోర్ట్ స్పష్టం చేసింది.ఇక, తర్వాతి దశలో భాగంగా రెండు దేశాలూ తమ రాయబారులను తిరిగి ఆయా దేశాల్లో నియమించనున్నట్లు కూడా ఆ రిపోర్ట్ వెల్లడించింది. 2019లో జమ్ముకశ్మీర్కు ప్రత్యేకహోదా ఎత్తేసిన తర్వాత పాకిస్థాన్ న్యూఢిల్లీ నుంచి తమ రాయబారిని వెనక్కి పిలిచింది. ఇక, ఆ తర్వాత రెండు దేశాలు వాణిజ్యం, కశ్మీర్కు శాశ్వత పరిష్కారంపై కూడా చర్చించనున్నట్లు ఆ రిపోర్టు తెలిపింది.
యూఏఈ మద్యవర్తిత్వంలో భారత్, పాకిస్తాన్ మధ్య సాగుతోన్న రహస్య శాంతి ప్రణాళిక అచ్చంగా అమెరికా ప్రయోజనాల కోసమే అనుకోడానికీ వీల్లేదని, మళ్లీ వ్యాపార, వాణిజ్య, దౌత్య సంబంధాలను పున:ప్రారంభించడం ద్వారా రెండు దేశాలూ లబ్దిపొందే వీలుందని కథనంలో తెలిపారు. చైనాను కట్టడి చేసే దిశగా అమెరికా.. ఇండో పసిఫిక్ రీజియన్ లో కీలక కార్యకలాపాలు నెరపుతుండటం, చైనాను నిలువరించాలని ప్రధాని మోడీ కూడా భావిస్తున్నందున అందుకు ఉపకరించే ప్రతి అవకాశాన్నీ వాడుకోవాలని భారత్ యోచిస్తున్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. భారత్, పాక్ మధ్య మారిన సంబంధాలకు గుర్తుగా మన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం(మార్చి 21న) పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు విషెస్ తెలిపారు. కరోనా బారిపడ్డ పాక్ ప్రధాని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ మోడీ ట్వీట్ చేశారు.
