Ashwini Vaishnaw: భారతదేశపు టాప్ క్లాస్ రైలు అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్లో కూర్చోవడానికి ఎవరు ఇష్టపడరు? అయితే, దీని ఛార్జీలు ఇతర రైళ్ల కంటే కొంచెం ఎక్కువగానే ఉండడం వల్ల చాలా మంది ఎక్కలేకపోతున్నారు. అయితే ఈ రైలులో ఉచితంగా ప్రయాణం ఇస్తే ఎక్కకుండా ఉండగలరా? ఇలాంటి అవకాశమే కొంత మంది విద్యార్థులకు కల్పించింది రైల్వే మంత్రిత్వ శాఖ. ఒడిశాలోని కటక్లో ఉన్న సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులను పోటీ ద్వారా ఎంపిక చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం తెలిపారు.
కేంద్ర మంత్రి ఆదివారం సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలకు భూమి పూజ చేసి విద్యార్థులతో ముచ్చటించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ ‘‘వందే భారత్ వీడియో చూసిన విద్యార్థులకు వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించాలని కోరిక కలిగింది. పోటీ నిర్వహించి వారిలో ఎంపికైన 50 మంది విద్యార్థులకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పిస్తాం’’ అని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ మే 18న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పూరీ-హౌరా మధ్య ఒడిశా తొలి వందే భారత్ రైలును ప్రారంభించారు. ఇక ఇదే సమయంలో భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధి పనులను కూడా కేంద్ర మంత్రి ప్రారంభించారు. ప్రతిష్టాత్మకమైన భువనేశ్వర్ రాజధాని రైలుకు రేపటి నుంచి కొత్త ‘తేజస్’ రేక్ రావడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నది ప్రధాని మోదీ దార్శనికమన్నారు. కాగా, రేపు భువనేశ్వర్ రైల్వేస్టేషన్ను సందర్శించి పరిశీలిస్తామని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. వీటిలో ఖుర్దా రోడ్లోని 11 స్టేషన్లు సహా ఒడిశాలో మొత్తం 25 స్టేషన్లు ఉన్నాయి. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ఈ 508 స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. వీటిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో 55 చొప్పున, బీహార్లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్లో 37, మధ్యప్రదేశ్లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్లో 22, గుజరాత్-తెలంగాణ 21 చొప్పున, జార్ఖండ్ లో 20, ఆంధ్రప్రదేశ్-తమిళనాడు రాష్ట్రాల్లో 18 చొప్పున, హర్యానా 15, కర్ణాటక 13తో పాటు మరికొన్ని ఉన్నాయి.