×
Ad

లోక్‌సభలో ఓ తెలంగాణ ఎంపీ సహా 8 మంది సభ్యులపై సస్పెన్షన్‌.. ఎందుకంటే?

తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతోనే ఆందోళన చేశామని, తమ నోరు మూయించాలని బీజేపీ యత్నిస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు.

  • తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై సస్పెన్షన్
  • రాహుల్‌ మాట్లాడుతుండగా మైక్‌ కట్ చేశారన్న ఎంపీ
  • ప్రశ్నిస్తే తమను సస్పెండ్ చేశారని ఆరోపణలు

Lok Sabha: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో చర్చ సందర్భంగా గందరగోళం సృష్టించినందుకు ఎనిమిది మంది ప్రతిపక్ష సభ్యులు ఈ బడ్జెట్‌ సెషన్‌ మొత్తం పాల్గొనకుండా సస్పెండ్‌ చేస్తూ లోక్‌సభ తీర్మానం చేసింది.

సభలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్), పంజాబ్ ఎంపీలు గుర్జీత్ సింగ్ ఔజ్లా (కాంగ్రెస్), అమరీందర్ సింగ్ రాజా వారింగ్ (కాంగ్రెస్), కేరళ ఎంపీలు హిబి ఈడెన్ (కాంగ్రెస్), డీన్ కురియాకోస్ (కాంగ్రెస్), తమిళనాడు ఎంపీలు మాణిక్కం ఠాగూర్ (కాంగ్రెస్), ఎస్.వెంకటేశన్ (సీపీఎం), మహారాష్ట్ర ఎంపీ ప్రశాంత్ పడోలే (కాంగ్రెస్)పై సస్పెన్షన్‌ వేటు వేశారు.

Dilip Saika (Pic: @sansad_tv)

దీనిపై చామల కిరణ్ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ లోక్‌సభలో మాట్లాడుతుండగా మైక్‌ కట్ చేయడాన్ని ప్రశ్నిస్తే తమను సస్పెండ్ చేశారని ఆరోపించారు. తమకు అవకాశం ఇవ్వకపోవడంతోనే ఆందోళన చేశామని, తమ నోరు మూయించాలని బీజేపీ యత్నిస్తోందని అన్నారు.

Also Read: కల్తీ లడ్డూ వ్యవహారంలో కుట్రదారుల్ని శిక్షించేందుకు చర్యలు.. పవన్, సత్యకుమార్‌తో చంద్రబాబు భేటీ

లోక్‌సభలో ఏం జరిగింది?
ఆ ఎనిమిది మంది ఎంపీలు పేపర్లు చింపటం, స్పీకర్‌ చైర్ వైపు వాటిని విసరటం, గందరగోళం సృష్టించడం వంటి చర్యలకు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగం సాగుతున్న సమయంలో సభలో గందరగోళం నెలకొంది. ఆ సమయంలో చైర్‌లో దిలీప్ సైకియా ఉన్నారు. పదేపదే అంతరాయాల వల్ల సభా కార్యక్రమాలు కొనసాగలేని పరిస్థితి వచ్చింది.

దీంతో సభా గౌరవం కాపాడటానికి ఈ సెషన్ మొత్తం ఎనిమిది మందిపై సస్పెన్షన్ వేయడం తప్పనిసరి అని కేంద్రం వాదించింది. చివరకు ఎనిమిది మందిపై సస్పెన్షన్ వేటు పడింది.

ఇవాళ అంతా గందరగోళం, పలు వాయిదాల మధ్య లోక్‌సభ కొనసాగింది. ఈ గందరగోళానికి ప్రతిస్పందనగా మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్‌కు అధికారిక ఫిర్యాదు ఇస్తామని బీజేపీ తెలిపింది.