Covid Vaccine : నర్స్ నిర్లక్ష్యం.. 5నిమిషాల వ్యవధిలో రెండు టీకా డోసులు!
ఓ నర్సు నిర్లక్ష్యం కారణంగా పెద్ద పొరపాటు జరిగింది. ఓ వ్యక్తికి కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండు టీకా డోసులు ఇచ్చేసింది.
- Naveen
- Updated on- June 11, 2021 / 12:02 PM IST
Covid Vaccine
Covid Vaccine Both Doses : ఓ నర్సు నిర్లక్ష్యం కారణంగా పెద్ద పొరపాటు జరిగింది. ఓ వ్యక్తికి కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండు టీకా డోసులు ఇచ్చేసింది. ఉత్తర ప్రదేశ్ లలిత్పూర్ జిల్లాలోని రావర్పురా ప్రాంతంలో ఓ వ్యాక్సిన్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. తాను వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లే సమయానికి నర్సులంతా ఏదో మాట్లాడుకుంటున్నారని తెలిపాడు. అదే సందట్లో ఓ నర్సు తనకు వెంట వెంటనే రెండు డోసులు ఇచ్చేసిందని వాపోయాడు. అయితే ఒక డోసుకు, మరో డోసుకు మధ్య కొంత వ్యవధి ఉంటుందని తనకు తెలియదని బాధితుడు వివరించాడు.
ఇంటికెళ్లాక బాగా నీరసంగా, కంగారుగా ఉండడంతో.. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పానని అతడు తెలిపాడు. ఆ వెంటనే చీఫ్ మెడికల్ ఆఫీసర్ను కలిసి దీనిపై ఫిర్యాదు చేశామన్నాడు. ప్రస్తుతం డాక్టర్లు ఆ వ్యక్తికి ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యవహారం జిల్లా వైద్యాధికారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీనిపై ఇప్పటికే అంతర్గత దర్యాప్తు ప్రారంభించామని సీఎంవో తెలిపింది. కాగా, రెండో డోసు వల్ల ఆ వ్యక్తికి ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని సీఎంవో స్పష్టం చేసింది. దీంతో బాధితుడు, అతడి కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
