బెంగాల్ లో ముగిసిన ఆరో దశ పోలింగ్

Bengal Elections

Bengal Elections పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఆరో విడత పోలింగ్​ ముగిసింది. కరోనా నిబంధనల మధ్య సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్​ జరగగా.. కొవిడ్​ బాధితులకు చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. నాలుగు జిల్లాల పరిధిలోని 43 నియోజకవర్గాల్లో 306 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. దాదాపు 79.11 శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అక్కడక్కడా కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్​ సజావుగా సాగినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

కాగా, పోలింగ్ సమయంలో ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని తితాగఢ్​లోని టాటా గేట్​ వద్ద నాటు కొంతమంది దుండగులు నాటు బాంబులను విసిరారు. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో అధికార టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తడంతో సమాచారం అందుకున్న కేంద్ర బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని అల్లరి మూకలను చెదరగొట్టాయి.

జగ్​ద్దాల్​ అసెంబ్లీ నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన ఏడుగురు పోలింగ్ ఏజెంట్లు కనబడకుండా పోయారని టీఎంసీ ఆరోపించింది. ఫోన్​ ద్వారాను వారి ఆచూకీ లభించటం లేదని పేర్కొంది. జిల్లాలోని మేఘ్నా ప్రాంతంలో బాంబు దాడులు జరిగిన క్రమంలో వారు గల్లంతైనట్లు తెలిపింది. ​ఉత్తర దినాజ్​పుర్​లోని ఖునియా గ్రామంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. అయితే.. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు.

ఇక, ఎనిమిది దశల్లో జరగుతున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఆరు దశల పోలింగ్ ముగిసింది.ఏడో దశ పోలింగ్ ఏప్రిల్​ 26న, ఎనిమిదవ దశ పోలింగ్ ఏప్రిల్​ 29న జరగనుంది. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.