Bengal Elections
Bengal Elections పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఆరో విడత పోలింగ్ ముగిసింది. కరోనా నిబంధనల మధ్య సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ జరగగా.. కొవిడ్ బాధితులకు చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. నాలుగు జిల్లాల పరిధిలోని 43 నియోజకవర్గాల్లో 306 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. దాదాపు 79.11 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అక్కడక్కడా కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ సజావుగా సాగినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
కాగా, పోలింగ్ సమయంలో ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని తితాగఢ్లోని టాటా గేట్ వద్ద నాటు కొంతమంది దుండగులు నాటు బాంబులను విసిరారు. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో అధికార టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తడంతో సమాచారం అందుకున్న కేంద్ర బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని అల్లరి మూకలను చెదరగొట్టాయి.
జగ్ద్దాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన ఏడుగురు పోలింగ్ ఏజెంట్లు కనబడకుండా పోయారని టీఎంసీ ఆరోపించింది. ఫోన్ ద్వారాను వారి ఆచూకీ లభించటం లేదని పేర్కొంది. జిల్లాలోని మేఘ్నా ప్రాంతంలో బాంబు దాడులు జరిగిన క్రమంలో వారు గల్లంతైనట్లు తెలిపింది. ఉత్తర దినాజ్పుర్లోని ఖునియా గ్రామంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. అయితే.. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు.
ఇక, ఎనిమిది దశల్లో జరగుతున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఆరు దశల పోలింగ్ ముగిసింది.ఏడో దశ పోలింగ్ ఏప్రిల్ 26న, ఎనిమిదవ దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.