Abhishek Banerjee Attacked: మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడిపై దాడి.. రాళ్లు, గుడ్లు, చెప్పులతో అటాక్..

అభిషేక్ బెనర్జీపై దాడి ఘటనపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. ఈ దాడికి అధికార బీజేపీనే కారణమని ఆరోపించింది.

  • Updated on- May 30, 2026 / 11:33 PM IST

Abhishek Banerjee Attacked: వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీపై దాడి జరిగింది. రాళ్లు, కోడి గుడ్లు, చెప్పులతో ఆయన పై అటాక్ చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

రాష్ట్రంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో బాధితులను పరామర్శించేందుకు ఎంపీ అభిషేక్ బెనర్జీ సోనార్ పూర్ కు వెళ్లారు. ఈ పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. స్థానికులు తిరగబడ్డారు. కోపంతో ఊగిపోయారు. అభిషేక్‎పై దాడి చేశారు. రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. ఆయన చొక్కా పట్టుకుని లాగారు. కొందరు చేయి చేసుకున్నారు. అభిషేక్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాడి నుంచి కాపాడుకునేందుకు అభిషేక్ బెనర్జీ క్రికెట్ ప్లేయర్లు వాడే హెల్మెట్ ధరించాల్సి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఆయన సిబ్బంది.. అభిషేక్ ను చుట్టుముట్టి రక్షణగా నిలిచారు.

స్థానికుల దాడితో అభిషేక్ బెనర్జీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు బీజేపీనే కారణమని ఆయన ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే తనపై దాడి జరిగిందన్నారు. వాళ్లు తనను చంపేందుకు ప్రయత్నించారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తనపై దాడి సమయంలో పోలీసులు అక్కడ కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ ఘటనపై న్యాయ పోరాటం చేస్తానని అభిషేక్ బెనర్జీ తెలిపారు. అదృష్టవశాత్తూ హెల్మెట్ ధరించడం వల్ల తన తలకు ఏమీ కాలేదన్నారు. తన బట్టలు చించి, కళ్లజోడు పగలగొట్టారని వాపోయారు. దాడిలో గాయపడ్డ అభిషేక్ బెనర్జీ కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. మమతా బెనర్జీ ఆసుపత్రికి వెళ్లి అభిషేక్‎ను పరామర్శించారు.

అభిషేక్ బెనర్జీపై దాడి ఘటనపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. ఈ దాడికి అధికార బీజేపీనే కారణమని ఆరోపించింది. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు కరెక్ట్ కాదంది. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయంది. కాగా, అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ ఎంపీగా ఉన్నారు. ఇక, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్నారు.