టీడీపీ వర్సెస్ మార్షల్స్ : అసెంబ్లీలో ఘర్షణ వీడియోలు ప్రదర్శన

  • Publish Date - December 13, 2019 / 04:49 AM IST

మార్షల్స్ తో టీడీపీ నేతలకు జరిగిన ఘర్షణ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. మార్షల్స్ తమతో అనుచితంగా ప్రవర్తించారని, అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నారని, దాడి కూడా చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. నిన్నటి ఘర్షణ తాలుకూ వీడియోలను శుక్రవారం(డిసెంబర్ 13,2019) సభలో ప్రదర్శించింది. అసలేం జరిగిందో అందరికీ తెలియాలి అంటూ వీడియోలను చూపింది. ఎవరు ఎవరిపై దౌర్జన్యం చేశారో ప్రజలకు తెలుస్తుంది అంటూ ఘర్షణకు సంబంధించిన వీడియోలను అసెంబ్లీలో ప్రదర్శించారు.

గురువారం(డిసెంబర్ 12,2019) అసెంబ్లీ గేటు దగ్గర టీడీపీ నేతలకు, మార్షల్స్ కు మధ్య ఘర్షణ జరిగింది. అసెంబ్లీలోకి రాకుండా తమను అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. టీడీపీ నేతలే దౌర్జన్యం చేశారని ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. మార్షల్స్ వారి విధులు వారు నిర్వర్తించారని వివరించింది.

నిబంధనల ప్రకారం.. అసలు ఆ గేటు ద్వారా ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీలోకి రాకూడదని ప్రభుత్వం చెప్పింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు రూల్స్ బ్రేక్ చేశారని, ఎమ్మెల్యేలు కాని వారిని కూడా అసెంబ్లీ లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించింది. ఈ క్రమంలోనే మార్షల్స్ వారిని అడ్డుకోవటం జరిగిందన్నారు. ఇందులో మార్షల్స్ తప్పేమీ లేదన్నారు. తప్పంతా టీడీపీ నేతలదే అని ప్రభుత్వం తెలిపింది. తప్పు చేయడమే కాకుండా అసెంబ్లీ ఉద్యోగులపై దౌర్జన్యం చేశారని అధికార పార్టీ నేతలు మండిపడ్డారు.