ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సంచలన నిర్ణయం
- veegam team
- Published On : November 6, 2019 / 10:29 AM IST
ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం లీవ్ పెట్టారు. నెల రోజుల పాటు సెలవు పెట్టారు. కొత్త బాధ్యతలు స్వీకరించకుండానే ఆయన సెలవుపై వెళ్లిపోయారు. ఏకంగా డిసెంబర్ 6 వరకు ఆయన లీవ్ లో ఉంటారు. ఏపీ సీఎస్ బాధ్యతల నుంచి ఎల్వీని తప్పించిన జగన్ ప్రభుత్వం.. ఆయనకు బాపట్ల హెచ్ఆర్డీ డీజీగా బాధ్యతలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొత్త బాధ్యతలు స్వీకరించకుండానే ఎల్వీ లీవ్ పై వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అధికారిక వర్గాల్లో చర్చకు దారితీసింది. కాగా ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్రం సర్వీసుకు వెళ్లే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
ఎల్వీని సీఎస్ బాధ్యతల నుంచి జగన్ ప్రభుత్వం సడెన్ గా తప్పించడం సంచలనంగా మారింది. రాజకీయవర్గాల్లో ప్రకంపనలు రేపింది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. విపక్షాలు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. సీఎస్ బదిలీని తప్పుపట్టాయి. ప్రభుత్వం తీరు చూస్తుంటే ఏదో తప్పు జరిగిందని అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పారు. ఏరికోరి తెచ్చుకున్న సీఎస్ ఎల్వీని సడెన్ గా బదిలీ చేయడం వెనుక కారణం ఏంటో చెప్పాలని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అటు చంద్రబాబు కూడా ఈ చర్యని ఖండించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన వైసీపీ సర్కార్ కి ఏమాత్రం లేదన్నారు చంద్రబాబు. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ ఇందుకు నిదర్శనం అన్నారాయన. వ్యక్తులను, వ్యవస్థలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం జరుగుతోందని చంద్రబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే.
