Jharkhand: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు సుప్రీంలో ఎదురుదెబ్బ.. ఈడీ పిటిషన్ పై నో రిలీఫ్
రాంచీలో భూ కుంభకోణానికి సంబంధించి సీఎం సోరెన్ను ఈడీ విచారించాల్సి ఉంది. కేవలం రాజకీయ కారణాలతోనే తనను వేధిస్తున్నారని హేమంత్ సోరెన్ విమర్శిస్తున్నారు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని ఆయన అభివర్ణించారు
- tony bekkal
- Published On : September 18, 2023 / 04:23 PM IST
CM Hemant Soren: ఈడీ సమన్లను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీఎంకు సుప్రీంకోర్టు ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదు. హైకోర్టులో తన వాదనను వినిపించాలని ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఆయన తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మధ్యంతర ఉపశమనం కోసం హైకోర్టును సుప్రీంకోర్టు కోరింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు ఈడీ సమన్లు జారీ చేసి విచారణకు పిలిచింది. దానిపైనే సోరెన్, సుప్రీం తలుపు తట్టారు.
రాంచీలో భూ కుంభకోణానికి సంబంధించి సీఎం సోరెన్ను ఈడీ విచారించాల్సి ఉంది. కేవలం రాజకీయ కారణాలతోనే తనను వేధిస్తున్నారని హేమంత్ సోరెన్ విమర్శిస్తున్నారు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని ఆయన అభివర్ణించారు. సీఎం సోరెన్ ఆగస్టు 23న సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్పై తొలుత సెప్టెంబర్ 15న విచారణ జరగాల్సి ఉంది. అయితే ఆయన తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ అనారోగ్యం కారణంగా విచారణ వాయిదా పడింది. దీని తర్వాత, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేల ఎమ్ త్రివేది ధర్మాసనం కోర్టు విచారణ తేదీని సెప్టెంబర్ 18న అంటే ఈరోజుగా నిర్ణయించింది.
ఈడీ పంపిన మూడు సమన్లలో ఇప్పటి వరకు హేమంత్ సోరెన్ హాజరు కాకపోవడం గమనార్హం. చట్టపరమైన మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని వారు సూచించారు. ఇంతలో, ఈడీ ఆయనకు నాల్గవ సారి సమన్లు పంపి విచారణకు పిలిచింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తర్వాత సీఎం సోరెన్ తదుపరి అడుగు ఏమిటన్నది చూడాలి.
