టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. పోలీసులు తన కోసం వస్తున్నారని తెలుసుకున్న కూన మంగళవారం(ఆగస్టు 27,2019) నుంచి కనిపించడం లేదు. కూన రవికుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పలు బృందాలు రంగంలోకి దిగాయి. కూన రవికుమార్ కోసం సెర్చ్ చేస్తున్నాయి. బుధవారం(ఆగస్టు 28,2019) శ్రీకాకుళం కొత్త రోడ్డు దగ్గర పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను దుర్భాషలాడారని కూన రవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కూన రవితో పాటు 12మందిపై పోలీసులు కేసులు పెట్టారు. అప్పటి నుంచి కూన రవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కూన రవిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెతుకుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయ సిబ్బందిని దుర్భాషలాడారని, బెదిరించారని కూన రవిపై ఆరోపణలు ఉన్నాయి. ఎంపీడీవో సిబ్బంది ఫిర్యాదుతో కూన రవి సహా 12 మందిపై సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సరుబుజ్జిలి పోలీసులు మంగళవారం(ఆగస్టు 27,2019) ఆముదాలవలసకు వచ్చారు. ఆముదాలవలసలో కూన రవికుమార్ కనిపించలేదు.
ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూన రవికుమార్ అధికారులను హెచ్చరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ కార్యకర్తలు తెచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోకుండా నాటకాలు చేస్తే అధికారులను గదిలో వేసి చావగొడతా అని ఆయన వార్నింగ్ ఇచ్చారని సిబ్బంది ఫిర్యాదు చేశారు.
తనమీద వస్తున్న ఆరోపణలను కూన రవి ఖండించారు. తాను ఎంపీడీవో కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి హల్ చల్ చేశానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. కేవలం ప్రజా సమస్యలపై చర్చించేందుకే ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లానని వివరణ ఇచ్చారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. స్పీకర్ తమ్మినేని సీతారం ఒత్తిడితోనే తనపై కేసు పెట్టారన్న కూన… ఎవరెన్ని కుట్రలు పన్నినా ఎదుర్కొంటానని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఉద్యోగులను అవమానించారని ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన కూన రవికుమార్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు చర్యలు తీసుకోకపోవడం వల్లే పునరావృతం అవుతున్నాయని వాపోయారు. కూన రవి బెదిరింపులకు పాల్పడ్డ ఆడియో వీడియో సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయని వెల్లడించారు. ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు అని.. అలాంటి ఉద్యోగులను అవమానించడాన్ని, వారిపై బెదిరింపులకు దిగటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రవికుమార్పై చర్యలు తీసుకోకపోతే ఉద్యోగులమంతా మూకుమ్మడి సెలవుల్లోకి వెళతామని హెచ్చరించారు.
Also Read : స్కూల్ వ్యాన్ బోల్తా : ముగ్గురు విద్యార్థులు మృతి