ప్రధాని మోడీ గుంటూరు టూర్ : మిన్నంటిన నిరసనలు
ప్రధాని మోడీ గుంటూరులో పర్యటన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
- veegam team
- Published On : February 10, 2019 / 04:08 AM IST
ప్రధాని మోడీ గుంటూరులో పర్యటన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
గుంటూరు : ప్రధాని మోడీ గుంటూరులో పర్యటన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు, నిరనలు నిర్వహిస్తున్నాయి. ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చలేదని ప్రతిపక్ష నేతలు బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. మోడీ గో బ్యాక్ నినాదాలు, నల్ల జెండాలతో హోరెత్తిస్తున్నారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వరకు పెద్ద ఎత్తున మోడీకి వ్యతిరేకంగా హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. మోడీ పర్యటనను అడ్డుకుని సీపీఎం హెచ్చరించగా… రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసనలు చేపడుతోంది.
మరోవైపు… బీజేపీ శ్రేణులు ఈ సభను సవాల్గా తీసుకున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిర్వహిస్తున్న ఈ సభపై కమలం పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. గుంటూరూలోనే మకాం వేసిన బీజేపీ కీలక నేతలు జనసమీకరణపై దృష్టి సారించారు. సభను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. యాక్షన్కు రియాక్షన్ చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఓ వైపు కేంద్రంలోని అధికార పార్టీ – మరోవైపు రాష్ట్రంలోని అధికార పార్టీ రంగంలోకి దిగడంతో అందరి దృష్టి మోడీ పర్యటనపైనే ఉంది. బీజేపీ – టీడీపీ రగడలతో ప్రధాని పర్యటన ఉత్కంఠకు దారి తీస్తోంది. అటు… పోలీసులు మాత్రం మోడీ పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. 1700 మంది పోలీసులను రంగంలోకి దించారు.
