Abhinav Mukund tweet viral
Abhinav Mukund tweet : వెస్టిండీస్ పర్యటన కోసం భారత టెస్ట్, వన్డే టీమ్లను బీసీసీఐ ప్రకటించింది. వన్డే టీమ్లో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే.. టెస్టు టీమ్లో మాత్రం భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. సీనియర్ ఆటగాడు పుజారా(Pujara), ఉమేశ్ యాదవ్(Umesh Yadav)లపై వేటు పడింది. అదే సమయంలో ఐపీఎల్లో రాణించిన యశస్వి జైస్వాల్(Yasaswi Jayaswal), రుతురాత్ గైక్వాడ్(Ruturaj Gaikwad), ముకేశ్ కుమార్(Mukesh Kumar)లకు అవకాశం ఇచ్చారు. రంజీ ట్రోఫీలో సత్తా చాటుతున్న సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan)కు మాత్రం మరోసారి మొండి చేయే ఎదురైంది.
ఐపీఎల్లో రాణించిన వారికి మాత్రమే అవకాశం ఇస్తున్నారని, దీంతో రంజీ ట్రోఫీలో రాణించిన ఆటగాళ్లకు అన్యాయం జరుగుతోందని పలువురు మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానులు మండిపడుతున్నారు. సెలెక్టర్ల తీరును తప్పుబడుతున్నారు. టీమ్ఇండియా ఆటగాడు అభినవ్ ముకుంద్(Abhinav Mukund ) సోషల్ మీడియా వేదికగా ఇదే విషయాన్ని ప్రశ్నించాడు. భారత జట్టులోకి వేగంగా రావాలంటే ఒక్కటే మార్గం ఉంది. అది ఐపీఎల్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు.
వెస్టిండీస్ పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేసిన సెలక్షన్ విధానం అర్ధం చేసుకోవడం కాస్త కష్టంగానే ఉంది. నా మనసులోంచి వచ్చిన ఆలోచనలను మీతో పంచుకోవాలని అని అనుకుంటున్నాను. రంజీల్లో తన రాష్ట్రం కోసం ఆడిన ఆటగాళ్లకు వచ్చిన లాభం ఏంటి..? ప్రాంఛైజీ క్రికెట్ ఆడడం వల్ల చాలా వేగంగా జాతీయ జట్టులోకి వెళ్లే అవకాశం వస్తుందని స్పష్టంగా అర్ధం అవుతోంది అని ముకుంద్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్గా మారగా నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Unable to understand these selections- too many thoughts in my head to compile into a tweet. But what is the incentive for a young player to take pride in playing for his state anymore? Clearly the franchise route is a faster way to scale the grade. #INDvsWI
— Abhinav Mukund (@mukundabhinav) June 23, 2023
ఇక్కడ యశస్వి జైస్వాల్, రుతురాత్ గైక్వాడ్, ముకేశ్ కుమార్లను ఎంపిక చేయడాన్ని ఎవ్వరూ తప్పుబట్టడం లేదుగానీ రంజీల్లో రాణించిన వారిని పక్కన బెట్టడం సరైంది కాదని మాత్రమే అంటున్నారు. సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వర్ వంటి చాలా మంది ఆటగాళ్లు గత కొంత కాలంగా రంజీల్లో నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తూ జాతీయ జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి అన్యాయం జరుగుతోందని అంటున్నారు. ఇక మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
జూలై 12 నుంచి వెస్టిండీస్ పర్యటన ఆరంభం కానుంది. ఈ పర్యటనలో టీమ్ఇండియా అతిథ్య విండీస్తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. టెస్టులు, వన్డేలలో పాల్గొనే భారత జట్లను ప్రకటించగా టీ20ల్లో ఆడే జట్టును ఇంకా ప్రకటించలేదు.
European Cricket League T10 : బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే నువ్వే గదయ్యా..! వీడియో వైరల్