Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌, పాకిస్థాన్ మధ్య ఆ రోజు మ్యాచ్‌.. హర్భజన్ సింగ్ హెచ్చరిక..

అప్పట్లో 180 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌, పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 23న దుబాయ్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. భారత్‌, పాక్ మ్యాచ్‌ అంటే ఉండే క్రేజే వేరు. పాకిస్థాన్‌పై భారత్‌కు మంచి రికార్డు ఉన్నప్పటికీ టీమిండియాను మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హెచ్చరిస్తున్నారు. పాకిస్థాన్‌ క్రికెటర్ ఫకర్ జమాన్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

టీమిండియాకు దక్కాల్సిన విజయాన్ని దూరం చేసిన అనుభవం ఫకర్‌ జమాన్‌కు ఉందని చెప్పారు. టీమిండియా గెలిచే అవకాశాలపై అతడు దెబ్బకొట్టవచ్చని తెలిపారు. అందుకే అతడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

కాగా, భారత్‌, పాకిస్థాన్ మ్యాచ్‌ అంటే ఈ రెండు దేశాల క్రికెట్ అభిమానులకు మాత్రమే కాదు. ప్రపంచ క్రికెట్ అభిమానుల్లోనూ ఆసక్తి ఉంటుంది. ఫకర్‌ జమాన్‌ విషయానికి వస్తే భారత్‌తో ఆడిన 6 మ్యాచుల్లో అతడు 46.80 సగటుతో స్ట్రైక్ రేట్ 82.39తో మొత్తం 234 రన్స్‌ చేశాడు.

భారత్‌, పాక్‌ మ్యాచ్‌పై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు తెలిపారు. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్య ఫేవరెట్ అని యువరాజ్‌ చెప్పగా, రిజ్వాన్‌ ఈ మ్యాచులో కీలకమని అఫ్రిదీ అన్నారు.

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న విషయం విదితమే. ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. కాగా, 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా – పాకిస్థాన్‌ తలపడ్డాయి. 180 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది.