Chennai Super Kings : ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం రేసు రసవత్తరంగా సాగుతోంది. ఈ తరుణంలో ప్రతీ మ్యాచులో విజయం సాధించడం ముఖ్యం. ఇలాంటి సమయంలో చెన్నై సూపర్ కింగ్స్కు గట్టి షాక్ తగిలింది. ఒకే సారి ఐదుగురు బౌలర్లు జట్టుకు దూరం అయినట్లుగా ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి.
చెపాక్ వేదికగా బుధవారం పంజాబ్ కింగ్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్లో సీఎస్కే మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని పంజాబ్ 17.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో చెన్నై ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సీఎస్కే తన తదుపరి మ్యాచ్ను కూడా పంజాబ్ కింగ్స్తోనే ఆడనుంది. మే 5 తేదీన ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్కు ఐదుగురు స్టార్ బౌలర్లు చెన్నైకి అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. ముస్తాఫిజుర్ రహ్మాన్, దీపక్ చహర్, తుషార్ దేశ్పాండే, మతీషా పతిరణా, మహేశ్ తీక్షణ లు పంజాబ్తో మ్యాచ్ ఆడే అవకాశాలు లేవని, వీరు ఎప్పుడు తిరిగి జట్టుతో చేరతారనే ఖచ్చితమైన సమాచారం లేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
టీ20 ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా జింబాబ్వేతో బంగ్లాదేశ్ ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్ స్వదేశానికి వెళ్లనున్నాడు. ఈ సిరీస్ మే 12న ముగిసినప్పటి మే 20 నుంచి అమెరికాతో మరో సిరీస్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ముస్తాఫిజుర్ మిగిలిన ఐపీఎల్ మ్యాచులు ఆడడం అసాధ్యమే. బుధవారం పంజాబ్తో జరిగిన మ్యాచే అతడికి ఈ సీజన్లో చివరి మ్యాచ్.
KKR : ఢిల్లీని చిత్తు చేసిన ఆనందంలో కేకేఆర్.. భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. పేసర్ పై మ్యాచ్ నిషేదం
పంజాబ్ కింగ్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో దీపక్ చహర్ గాయపడ్డాడు. తొలి ఓవర్లో రెండు బంతులే వేసి మైదానాన్ని వీడాడు. అతడి గాయం పై ఇప్పటి వరకు ఎలాండి అప్డేట్ లేదు. అయితే.. అతడు కోలుకునేందుకు నాలుగు నుంచి ఐదు రోజులు సమయం పట్టనుందని తెలుస్తోంది. ఇక తుషార్ దేశ్పాండే జ్వరంతో బాధపడుతున్నాడు. మతీషా పతిరణా, మహేశ్ తీక్షణ లు టీ20 ప్రపంచకప్కు వీసా ప్రాసెస్ కోసం శ్రీలంకకు వెళ్లారు. దీంతో ఐదుగురు స్టార్ బౌలర్లు లేకుండానే ఆదివారం పంజాబ్తో చెన్నై మ్యాచ్ ఆడనుంది. ఇది ఓ రకంగా చెన్నైకి గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచులు ఆడింది. ఐదు మ్యాచుల్లో గెలవగా మరో ఐదు మ్యాచుల్లో ఓడింది. 10 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.