ENG vs IND: మూడో రోజు మ్యాచ్ హైలైట్స్ చూశారా.. రిషబ్ పంత్ రనౌట్ తరువాత ఏం జరిగిందంటే.. వీడియో వైరల్
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది.
- Harishth Thanniru
- Published On : July 13, 2025 / 08:23 AM IST
ENG vs IND 3rd Test
ENG vs IND 3rd Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులకు ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ కాగా.. భారత్ జట్టు కూడా 387 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. అయితే, తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టుపై ఆధిక్యంకోసం టీమిండియా గట్టిగానే ప్రయత్నించినా ఆశ నెరవేరలేదు.
145/3 ఓవర్నైట్ స్కోర్తో మూడోరోజు (శనివారం) ఇన్నింగ్స్ను కొనసాగించిన కేఎల్ రాహుల్ (100), రిషబ్ పంత్ (74) రాణించారు. భారత జట్టు 248 పరుగుల వద్ద రిషబ్ పంత్ రనౌట్ అయ్యాడు. బషీర్ బౌలింగ్లో సింగిల్ తీసే ప్రయత్నంలో.. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ నేరుగా వికెట్లకు బంతిని విసిరాడు. దీంతో పంత్ రనౌట్ రూపంలో పెవిలియన్ బాటపట్టాడు. తరువాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (72) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, చివరిలో భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాటపట్టడంతో 387 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయింది.
చివర్లో రెండో ఇన్నింగ్స్ను ఇంగ్లాండ్ ప్రారంభించింది. ఓపెనర్లు క్రాలీ (2 నాటౌట్), డకెట్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఒక్క ఓవర్ మాత్రమే పడగా.. ఇంగ్లాండ్ జట్టు రెండు పరుగులతో ఉంది. ఆదివారం ఇంగ్లాండ్ ను ఎంత త్వరగా భారత్ ఆలౌట్ చేస్తుందన్న దానిపై విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
