Hong Kong Sixes 2025 : దినేశ్ కార్తీక్ ఎంత పని చేశావయ్యా.. పసికూనలు కువైట్, యూఏఈ చేతిలో ఘోర పరాభవం.. టోర్నీ నుంచి భారత్ ఔట్..
హాంకాంగ్ సిక్సర్ 2025 టోర్నీలో (Hong Kong Sixes 2025 ) టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది.
- Thota Vamshi Kumar
- Published On : November 8, 2025 / 11:40 AM IST
Hong Kong Sixes 2025 India Stunned By UAE Hours After Kuwait Shocker
Hong Kong Sixes 2025 : హాంకాంగ్ సిక్సర్ 2025 టోర్నీలో టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది. పూల్-సిలో పసికూన కువైట్తో జరిగిన మ్యాచ్లో దినేశ్ క్తారీక్ నాయకత్వంలోని భారత జట్టు 27 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో టీమ్ఇండియా సెమీస్కు చేరకుండానే ఈ టోర్నీ నుంచి నిష్ర్కమించింది.
శనివారం జరిగిన ఈ మ్యాచ్లో కువైట్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 106 పరుగులు సాధించింది. కువైట్ బ్యాటర్లలో కెప్టెన్ యాసిన్ పటేల్ (58 నాటౌట్; 14 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లు ) హాఫ్ సెంచరీ చేశాడు. బిలాల్ తాహీర్( 25; 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. టీమ్ఇండియా బౌలర్లలో అభిమన్యు మిథున్ రెండు వికెట్లు తీశాడు. స్టువర్ట్ బిన్నీ, నదీమ్, దినేశ్ కార్తీక్ తలా ఓ వికెట్ సాధించారు.
ఆ తరువాత 107 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 5.4 ఓవర్లలో 79 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో అభిమన్యు మిథున్(26; 9 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు ), షెహ్బాజ్ నదీమ్ (19; 8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు), ప్రియాంక్ పంచాల్ (17; 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) పర్వాలేదనిపించారు. ఓపెనర్ రాబిన్ ఉతప్ప డకౌట్ కాగా.. దినేశ్ కార్తిక్ (8), సువర్ట్ బిన్నీ (2) లు ఘోరంగా విఫలం అయ్యారు. కువైట్ బౌలర్లలో కెప్టెన్ యాసిన్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. బిలాల్ తాహిర్, అద్నాన్ ఇద్రీస్ చెరో వికెట్ సాధించారు.
టోర్నీ నుంచి ఔట్..
కువైట్ చేతిలో భారీ తేడాతో ఓడిపోవడంతో భారత్ ఈ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. పూల్-సిలో భారత్తో పాటు పాకిస్తాన్, కువైట్ జట్లు ఉన్నాయి. మూడు జట్లు కూడా ఒక్కొ మ్యాచ్లో విజయం సాధించడంతో తలా రెండు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే.. మెరుగైన రన్రేట్ కారణంగా కువైట్, పాక్ జట్లు తదుపరి రౌండ్కు అర్హత సాధించగా భారత్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది.
యూఏఈ చేతిలో కూడా..
కువైట్ చేతిలో ఓడిపోయిన తరువాత భారత్ బౌల్ లో భాగంగా యూఏఈతో ఆడింది. ఈ మ్యాచ్లోనూ భారత్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో అభిమన్యు మిథున్ (50; 16 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (42; 14 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. ఆ తరువాత 108 పరుగుల లక్ష్యాన్ని యూఏఈ 5.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది.
