ICC : ఇప్పుడిప్పుడే కరోనావైరస్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న దేశాలు కొత్త వేరియంట్ కారణంగా భయపడుతున్నాయి. మళ్లీ టెన్షన్ మొదలైంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు కొత్త ఆంక్షలు విధించాయి. దీని ఎఫెక్ట్ క్రీడారంగం పైనా పడింది. ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల వన్డే ప్రపంచకప్ అర్హత టోర్నీని అర్థాంతరంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. జింబాబ్వేలో జరుగుతున్న ఈ టోర్నీ కరోనా కారణంగా వాయిదా పడింది. దక్షిణాఫ్రికా దేశానికి పక్కనే జింబాబ్వే ఉంటుంది. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి భయంతో మ్యాచ్లను వాయిదా వేసినట్లు ఐసీసీ వివరించింది. అయితే ఈ టోర్నీని మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనేది ఐసీసీ వెల్లడించ లేదు.
UAN-Aadhar Link : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని చేయండి.. లేదంటే డబ్బులు రావు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాతో పాటు జర్మనీ, చెక్ రిపబ్లిక్ దేశాల్లోనూ వెలుగు చూసింది. కరోనా కొత్త వేరియంట్ నేపథ్యంలో అనేక ఆఫ్రికా దేశాలు ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నాయి. ఆయా దేశాలు చాలా తక్కువ వ్యవధిలో విమాన సర్వీసులు రద్దు చేయడంతో ప్రపంచకప్ అర్హత టోర్నీని నిలిపివేస్తున్నట్టు ఐసీసీ చెప్పింది.
కరోనా వైరస్ మరో కొత్త రూపంలో మానవాళిని భయాందోళనకు గురిచేస్తోంది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ విరుచుకుపడుతోంది. డెల్టా కంటే ప్రమాదకరమైన ఈ కొత్త రకం వైరస్తో అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. నిఘా పెంచాలని, ప్రజారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయాలని ఆగ్నేయాసియా ప్రాంత డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ సూచించారు.
కొవిడ్ వ్యాక్సినేషన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. పండుగలు, ఇతర వేడుకల్ని కొవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలని, భౌతికదూరం పాటించడంతో పాటు జనసమూహాలకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొవిడ్ నిబంధనల పట్ల అలసత్వం ప్రదర్శించరాదన్నారు.
వైరస్ ముప్పు నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ ముక్కు, నోటిని కప్పి ఉంచేలా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, జనసమూహాలకు దూరంగా ఉండటం, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, వెలుతురు లేని గదులకు దూరంగా ఉండటం, వ్యాక్సినేషన్ వేయించుకోవడం వంటివి కచ్చితంగా పాటించాలని నిపుణులు సూచించారు.