IND vs PAK : పాకిస్థాన్ కొత్త నాటకం.. ఆ అంపైర్ వల్లే ఓడాం..! ఐసీసీకి ఫిర్యాదు చేసిన పీసీబీ.. అసలు విషయం ఏమిటంటే..?
IND vs PAK పాకిస్థాన్ బ్యాటింగ్ సమయంలో ఫకర్ జమాన్ 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ఆ ఔట్ వివాదంగా మారింది.
- Harishth Thanniru
- Published On : September 22, 2025 / 08:54 PM IST
IND vs PAK
IND vs PAK : ఆసియా కప్ – 2025 సూపర్ -4లో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్లో పాకిస్థాన్ బ్యాటర్ ఫకర్ జమాన్ ఔట్ వివాదంగా మారింది.
పాకిస్థాన్ బ్యాటింగ్ సమయంలో ఫకర్ జమాన్ 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా బౌలింగ్లో వికెట్ కీపర్ సంజూ శాంసన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అయితే, ఈ క్యాచ్పై వివాదం నడుస్తుంది. ఇది ఔట్ కాదని పాకిస్థాన్ చెబుతుంది. సంజూ శాంసన్ క్యాచ్ అందుకునే సమయంలో బాల్ నేలను తాకిందని.. ఆ తరువాత గ్లౌజులోకి వెళ్లిందని పాకిస్థాన్ వాదిస్తుంది. సంజూ శాంసన్ క్యాచ్ అందుకున్న సమయంలో ఫీల్డ్ అంపైర్ ఘాజీ సోహెల్ ఔట్ ఇచ్చాడు. ఆ తరువాత టీవీ అంపైర్కు రిఫర్ చేశారు.
టీవీ అంపైర్ సంజూ శాంసన్ పట్టిన క్యాచ్ను అన్నికోణాల్లో పరిశీలించి దానిని ఔట్గా ప్రకటించాడు. ఓ కోణంలో బంతి నేలను తాకి బౌన్స్ అయినట్లు కనిపించినా వికెట్ కీపర్ చేతి వేలు బంతి కింద ఉన్నట్లుగా అంపైర్ తేల్చి ఔట్ ఇచ్చాడు. దీంతో ఫకర్ జమాన్ పెవిలియన్కు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం పాకిస్థాన్ ఈ విషయాన్ని పెద్ద వివాదంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. టీవీ అంపైర్ ఫకర్ జమాన్ను ఔట్గా ప్రకటించడం వల్లే తాము ఓడిపోయాము అన్నట్లుగా కొత్త వాదనను తెరపైకి తెస్తోంది.
ఫకర్ జమాన్ ఔట్ విషయంలో టీవీ అంపైర్ది తప్పుడు నిర్ణయం అని పేర్కొంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతనిపై ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పాక్ మేనేజర్ టీవీ అంపైర్ మీద ఐసీసీకి ఫిర్యాదు చేస్తూ మెయిల్ చేశాడని సమాచారం.
ఇదిలాఉంటే.. మ్యాచ్ అనంతరం ఫకర్ జమాన్ ఔట్ వివాదంపై పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా స్పందించాడు. ఆ బంతి వికెట్ కీపర్ అందుకునే లోపే బౌన్స్ అయినట్లు నాకు అనిపిస్తుంది. ఆ సమయంలో ఫకర్ జమాన్ బ్యాటింగ్ను చూస్తే.. పవర్ ప్లే మొత్తం ఆడేవాడని అనిపిస్తుంది. ఫకర్ జమాన్ క్రీజులో ఉండిఉంటే మా స్కోర్ 190 నుంచి 200కు పోయేది అంటూ సల్మాన్ అఘా అన్నాడు. తద్వారా ఫకర్ జమాన్ క్రీజులో ఉండిఉంటే భారత్ పై పాకిస్థాన్ గెలిచేది అనే వాదనను సల్మాన్ తెరపైకి తెచ్చాడు. తాజా పరిణామాలపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Fakhar Zaman was clearly out. Pak fans can keep crying 😅pic.twitter.com/sZZduqRwGM
— Rishi Kumar 🇮🇳 (@rishi45kumar) September 21, 2025
