ICC Champions Trophy 2025 : పాకిస్తాన్కు భారీ షాక్..? దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ..!
ICC Champions Trophy : ఇప్పుడు అందరి దృష్టి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పై పడింది. 2025లో ఈ టోర్నీ పాకిస్తాన్లో జరగనుంది. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగేది అనుమానమే.
- Thota Vamshi Kumar
- Published On : November 27, 2023 / 04:10 PM IST
ICC Champions Trophy 2025
వన్డే ప్రపంచకప్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పై పడింది. 2025లో ఈ టోర్నీ పాకిస్తాన్లో జరగనుంది. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగేది అనుమానమే. భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్కు టీమ్ఇండియాను పంపేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇష్ట పడడం లేదు. అదే సమయంలో భారత్తో పాటు మరికొన్ని దేశాలు సైతం పాక్లో ఆడేందుకు నిరాకరిస్తున్నాయని ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛాంపియన్స్ ట్రోఫిని దుబాయ్ వేదికగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని ఐసీసీ సూచనప్రాయంగానే అంగీకారం తెలిపింది. నిర్వహణ హక్కులను సంబంధించి ఇంకా ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదని తెలుస్తోంది. అయితే.. పాకిస్తాన్ మాత్రం వెంటనే నిర్వహణ హక్కులను సంబంధించిన హక్కులకు సంబంధించిన అగ్రిమెంట్ చేసుకోవాలని ఐసీసీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కోరుతుంది. టీమ్ఇండియా గనుక పాక్లో ఆడేందుకు నిరాకరిస్తే మాత్రం తమకు పరిహారం చెల్లించాలని అంటోంది.
PAKISTAN WON’T BE HOSTING 2025 CHAMPIONS TROPHY. (Abhishek Tripathi). pic.twitter.com/gta4KwBawI
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 27, 2023
ఏకపక్ష నిర్ణయాలు వద్దు..
తాజాగా.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్లో నిర్వహించడంపై చర్చించేందుకు ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డుతో పీసీబీ ఛైర్మన్ జకా అష్రఫ్, సిఓఓ సల్మాన్ నసీర్ సమావేశమయ్యారు. టీమ్ఇండియా పాక్కు రానంటే ఏ చేయాలన్న దానిపై వీరు చర్చించారు. ఇక ఎలాంటి పరిస్థితిలోనైనా ఐసీసీ టోర్నమెంట్పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదని పీసీబీ కోరింది. గత రెండు సంవత్సరాల కాలంలో అనేక జట్లు పాకిస్తాన్లో పర్యటించాయని ఈ సందర్భంగా పీసీబీ గుర్తు చేసింది.
ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఆసియా కప్కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే.. భారత జట్టును పాక్కు పంపేందుకు భారత దేశ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో భారత్ ఆడే అన్ని మ్యాచులను శ్రీలంక వేదికగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జరిగిన వన్డే ప్రపంచకప్లో భారత దేశంలో ఆడేందుకు మొదట పాకిస్తాన్ నిరాకరించింది. అయితే.. ఆ తరువాత జరిగిన పరిణాల నేపథ్యంలో ఆ జట్టు మెట్టు దిగిరాక తప్పలేదు.
Yashasvi Jaiswal : అది ముమ్మాటికీ నా తప్పే.. అందుకే క్షమాపణలు చెప్పా : యశస్వి జైస్వాల్
ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ హక్కులు సైతం పాకిస్తాన్ చేజారిపోతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ అభిమానులు పీసీబీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన జట్లు ఇవే..
వన్డే ప్రపంచకప్లో సెమీస్కు చేరిన టీమ్ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లతో పాటు ఆతిథ్య హోదాలో పాకిస్థాన్, పాయింట్ల పట్టికలో ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్లు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాయి. తొమ్మిదో స్థానంలో నిలిచిన శ్రీలంక, పదో స్థానంలో ఉన్న నెదర్లాండ్స్లు అర్హత సాధించలేకపోయాయి. అలాగే వన్డే ప్రపచకప్కు అర్హత సాధించడంలో విఫలం అయిన వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్ వంటి దేశాలు కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం లేదు.
