13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. దీంతో యావత్ భారత్ సంబరాల్లో మునిపోయింది. టీ20 ఫార్మాట్లో టీమ్ఇండియాకు ఇది రెండో ప్రపంచకప్. 2007లో ధోని సారథ్యంలో తొలిసారి టీ20 ప్రపంచకప్ను భారత్ ముద్దాడిన సంగతి తెలిసిందే.
విజేతలుగా నిలవడంతో భారత ఆటగాళ్లకు ట్రోఫీతో పాటు మెడల్స్ అందించారు. ఈ క్రమంలో టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మెడల్తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ మెడల్ మనల్ని కాస్త భిన్నంగా మార్చుతుందని అర్థం వచ్చేలా రాసుకొచ్చాడు. దీన్ని చూసిన అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్లు వెంటనే రిప్లైలు ఇచ్చారు. మొదటగా అక్షర్ పటేల్ ‘బద్రర్.. నా దగ్గర కూడా అదే పతకం ఉంది.’ అని అనగా.. ఆ వెంటనే సిరాజ్ ‘భాయ్.. నా దగ్గర కూడా అలాంటిదే ఉంది.’ అంటూ సరదాగా పంత్ను ఆటపట్టించారు.
కాగా.. ప్రపంచకప్ను గెలుచుకున్న నాలుగు రోజుల తరువాత టీమ్ఇండియా నేటి(గురువారం) ఉదయం 6 గంటలకు భారత్కు చేరుకుంది. బార్బడోస్లో తుఫాన్ కారణంగా అక్కడి ఎయిర్పోర్టును మూసివేశారు. అయితే.. బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి ఆటగాళ్లను ఢిల్లీ ఎయిర్ పోర్టుకు తీసుకువచ్చింది. ఎయిర్పోర్టులో భారత ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఎయిర్ పోర్టు నుంచి హోటల్కు చేరుకున్న భారత ఆటగాళ్లు కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పొట్టి ప్రపంచకప్ను సాధించినందుకు ఆటగాళ్లను మోదీ అభినందించారు. మోదీతో సమావేశం అనంతరం టీమ్ఇండియా ఆటగాళ్లు ముంబైకి బయలుదేరారు. సాయంత్రం 5 గంటలకు ఓపెన్ టాప్ బస్లో ఆటగాళ్ల రోడ్ షో ప్రారంభం కానుంది. ఓపెన్ టాప్ బస్సులో ప్రపంచకప్తో అభిమానులకు అభివాదం చేయనున్నారు. రాత్రి వాంఖడే స్టేడియంలో బీసీసీఐ భారత ఆటగాళ్లకు సన్మానం చేయనుంది.
Babar Azam : బాబర్ ఆజాంకు ఘోర అవమానం..! నేపాల్ జట్టులోనూ నో ప్లేస్..!