IND vs ENG : సిరాజ్ అవసరం లేదు..! రెండో టెస్టులో అతడిని పక్కన పెట్టండి
సొంత గడ్డ పై ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టెస్టు మ్యాచులో టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ విఫలం అయ్యాడు.
- Thota Vamshi Kumar
- Published On : January 29, 2024 / 01:44 PM IST
Mohammed Siraj
India vs England : సొంత గడ్డ పై ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టెస్టు మ్యాచులో టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ విఫలం అయ్యాడు. ఈ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో నాలుగు ఓవర్లు, రెండో ఇన్నింగ్స్లో ఏడు ఓవర్లు కలిపి మొత్తం 11 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఒక్క వికెట్ తీయలేదు సరికదా దారాళంగా పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలో రెండో టెస్టు మ్యాచ్కు అతడిని పక్కన పెట్టాలని భారత మాజీ ఆటగాడు పార్దీవ్ పటేల్ అన్నాడు. అతడి స్థానంలో ఓ స్పెషలిస్ట్ బ్యాటర్ను తీసుకోవాలని సూచించాడు.
తొలి టెస్టులో భారత జట్టు ఓటమిపై మాట్లాడుతూ పార్దీవ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు సరిపోతారన్నాడు. అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడించాలన్నాడు. సిరాజ్ను ఎక్కువగా ఉపయోగించుకోకపోతే అతడి స్థానంలో ఓ స్పెషలిస్ట్ బ్యాటర్ను తీసుకోవాలని, దీంతో భారత బ్యాటింగ్ లైనప్ డెప్త్ పెరుగుతుందన్నాడు. ఓ ఆరు లేదా ఏడు ఓవర్లు వేయించడం కోసం స్పెషలిస్ట్ పేసర్ అవసరమా అని ప్రశ్నించాడు.
IND vs ENG : రెండో టెస్టుకు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్..
కాగా.. మొదటి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు పేసర్ మార్క్ వుడ్ తో పాటు ముగ్గురు స్పిన్నర్లు జాక్ లీచ్, టామ్ హార్ట్లీ, రెహాన్ అహ్మద్లలో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 246 పరుగులకు ఆలౌటైంది. అనంతరం టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 436 పరుగులు చేసింది. దీంతో భారత్కు 190 పరుగుల ఆధిక్యం లభించింది.
అయితే.. ఓలీ పోప్ (196) భారీ శతకంతో చెలరేగడంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 420 పరుగులు చేసింది. 231 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 202 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు మ్యాచ్ విశాఖ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి ఆరంభం కానుంది.
Viral Video : క్రికెట్ మ్యాచా.. కామెడీ షోనా.. వీడియో చూస్తే పగలబడి నవ్వుతారు
