PV Sindhu
PV Sindhu : పారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. మూడో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన సింధు ప్రిక్వార్టర్స్లోనే ఇంటి ముఖం పట్టింది. ప్రపంచ 9వ ర్యాంకర్ చైనా షట్లర్ బింగ్ జావో రన్ చేతితో ఓటమి పాలైంది. 56 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో 19-21, 14-21 తేడాతో సింధు ఓడిపోయింది. డిఫెన్స్లో తప్పులు చేయడం వల్లే తాను ఓడిపోయినట్లుగా సింధు చెప్పుకొచ్చింది.
మ్యాచ్ అనంతరం తన ఓటమికి గల కారణాలు సింధు వివరించింది. డిఫెన్సివ్ షాట్లను ఎదుర్కొనే క్రమంలో కొన్ని తప్పులు చేసినట్లుగా తెలిపింది. వాటిని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందంది. ఎంతో కష్టపడితేనే ఇక్కడి వరకు వచ్చామని, విజయం కోసం శతవిధాలా ప్రయత్నించినట్లుగా చెప్పుకొచ్చింది.
ఇక ఓడిపోయినందుకు తానేమి బాధపడటం లేదంది. పోరాడుతూనే ఉంటానంది. ప్రిక్వార్టర్స్లో ప్రతి పాయింట్ కోసం మేమిద్దం చాలా శ్రమించాం. ఫలితం నాకు అనుకూలంగా లేదు. ఇక్కడ విజయం సాధించడం అంత సులువు కాదు. ప్రతి పాయింట్ను కాపాడుకోవడం ముఖ్యం అని సింధు అంది.
వచ్చే ఒలింపిక్స్ పై..
వచ్చే ఒలింపిక్స్కు నాలుగేళ్ల సమయం ఉందని, ఇప్పుడే దాని గురించి మాట్లాడడం అవసరం లేదంది. ప్రస్తుతం కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని ఆ తరువాత మళ్లీ బరిలోకి దిగనున్నట్లు చెప్పింది. నాలుగేళ్ల తరువాత ఏం జరుగుందో చూద్దామని, ఈ ఒలింపిక్స్లో పతకం సాధించాలనే లక్ష్యంతోనే ఆడినట్లుగా తెలిపింది. దురదృష్టవశాత్తూ ఓడిపోయానంది. ఆటల్లో గెలుపోటములు సహజం అని అంది. ఏదీ ఏమైనప్పటికీ తాను మాత్రం గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినట్లుగా తెలిపింది.