Team India World Cup squad : స్వదేశంలో అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న వన్డే ప్రపంచకప్ ( ODI World Cup) లో పాల్గొనే భారత తుది జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రకటించింది. ఆసియాకప్ 2023లో గాయపడిన అక్షర్ పటేల్ (Axar Patel) స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ను ఎంపిక చేసింది. ఈ మార్పు మినహా మిగిలిన జట్టును యథాతదంగానే ఉంది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో గాయపడిన అక్షర్ పటేల్ పూర్తిగా కోలుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసేందుకు ఈ రోజే (సెప్టెంబర్ 28) ఆఖరి రోజు కావడంతో సెలక్టర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
వాస్తవానికి వన్డే ప్రపంచకప్ కోసం మొదట ప్రకటించిన జట్టులో అశ్విన్కు చోటు దక్కలేదు. అయితే.. దీనిపై విమర్శలు వచ్చాయి. అదే సమయంలో ప్రపంచకప్కు ఎంపికైన అక్షర్ పటేల్ గాయపడడంతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు అశ్విన్ను ఎంపిక చేశారు. రెండు మ్యాచుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి అశ్విన్ సత్తా చాటాడు. దీంతో ప్రపంచకప్కు అశ్విన్ను ఎంపిక చేశారు.
భారత జట్టు సెప్టెంబర్ 30న, అక్టోబర్ 3న తేదీల్లో వార్మప్ మ్యాచులు ఆడనుంది. వన్డే ప్రపంచకప్లో భారత్ తన తొలి మ్యాచ్ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ మ్యాచ్కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదరుచూసే భారత్, పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. ఈ మ్యాచ్కు గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.
వన్డే ప్రపంచ కప్కు భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, షమీ, సిరాజ్.