WPL 2025: తొలి మ్యాచ్లోనే చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. బాబోయ్ ఏం కొట్టుడు కొట్టారు..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) -2025 టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ జెయింట్స్ (GG) జట్ల మధ్య జరిగింది.
- Harishth Thanniru
- Published On : February 15, 2025 / 08:04 AM IST
RCB Team
WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) -2025 టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ జెయింట్స్ (GG) జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసింది. అయితే, చివరకు విజయం బెంగళూరు జట్టునే వరించింది. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ లోనే డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరును ఛేదించడం ద్వారా బెంగళూరు జట్టు సంచలనం సృష్టించింది. రిచా ఘోష్ సుడిగాలి ఇన్నింగ్స్ తో ఆర్సీబీ విజయతీరాలకు చేరింది. రిచా ఘోష్ కేవలం 27 బంతుల్లోనే ఏడు ఫోర్లు, నాలుగు సిక్సులతో 64 పరుగులతో నాటౌట్ గా నిలిచింది.
ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ జట్టు నిర్ణీత ఓవర్లో ఐదు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. బెత్ మూనీ (56), ఆష్లే గార్డ్ నర్ (79నాటౌట్) రాణించడంతో గుజరాత్ జట్టు భారీ స్కోర్ ను చేయగలిగింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ జట్టుకు ఆదిలోనే వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. 14 పరుగులకే ఇద్దరు ఓపెనర్లు స్మృతి, డానీ వ్యాట్ లను గార్డ్ నర్ ఒకే ఓవర్లో అవుట్ చేసింది. దీంతో ఆర్సీబీ జట్టు ఓటమి దిశగా పయణించినట్లు కనిపించినా.. చివరిలో ఎలీస్ ఫెర్రీ(57) కి తోడు రిచాఘోష్ సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడటంతో భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ జట్టు అలవోకగా ఛేదించింది.
Also Read: IND vs ENG : వన్డే సిరీస్ ట్రోఫీని మరిచిపోయిన కోహ్లీ, రోహిత్, రాహుల్.. వీడియో వైరల్
గుజరాత్ పై విజయంతో మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరును ఛేదించిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో 200 కంటే ఎక్కువ పరుగులు స్కోరును విజయవంతంగా ఛేదించిన తొలి జట్టు కూడా ఆర్సీబీ జట్టే. అంతకుముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉంది. 2024లో గుజరాత్ జెయింట్స్ పై 191 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఛేదించింది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. డబ్ల్యూపీఎల్ చరిత్రలో నాలుగు అతిపెద్ద ఛేజింగ్ లు గుజరాత్ జట్టుపైనే ఉండటం గమనార్హం.
RCB – THE DEFENDING CHAMPIONS.
– What a blockbuster start to WPL 2025. 🌟pic.twitter.com/sWoG06Hz10
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 14, 2025
