ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్ను భారత జట్టు 4-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అదే ఉత్సాహంలో దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచుల టీ20 సిరీస్కు టీమ్ఇండియా సిద్ధమవుతోంది. ఆదివారం డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికా, భారత జట్లు మొదటి టీ20 మ్యాచులో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దక్షిణాఫ్రికా చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ను మొదలుపెట్టింది.
మొదటి ప్రాక్టీస్ సెషన్ ముగిసిన అనంతరం టీమ్ఇండియా యువ ఆటగాడు రింకూ సింగ్ మీడియాతో ముచ్చటించాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో అదరగొట్టిన ఈ ఆటగాడు సఫారీ పర్యటనలోనూ రాణించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. భారత పిచ్లతో పోలిస్తే దక్షిణాఫ్రికాలో అదనపు పేస్, బౌన్స్ ఉంటుందని దీనికి త్వరగా అలవాటు పడాలన్నాడు. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో పనిచేసే అవకాశం రావడంత తన అదృష్టమని చెప్పుకొచ్చాడు.
BCCI : ఏడాదికి బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా..? ఆస్ట్రేలియాతో పోలిస్తే ఎక్కువా..? తక్కువా..?
తన సహజశైలిలోనే బ్యాటింగ్ చేయమని రాహుల్ ద్రవిడ్ తనకు చెప్పినట్లు రింకూ సింగ్ తెలిపాడు. ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని, వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించినట్లు చెప్పాడు. మొత్తానికి మొదటి ప్రాక్టీస్ సెషన్ అద్భుతంగా జరిగిందని రింకూ అన్నాడు.
సవాలే.. అయినప్పటికీ..
ఐదు లేదా ఆరో స్థానంలో ఆడడం అంటే సవాల్తో కూడుకున్నదని చెప్పాడు. క్రీజులో కుదురుకునేందుకు సమయం ఉండదన్నాడు. అయితే.. ఉత్తరప్రదేశ్ తరుపున ఇదే స్థానంలో చాన్నాళ్లుగా ఆడుతున్నట్లు తెలిపాడు. ఇక ఈ స్థానంలో ఆడడం అంటే తనకు ఎంతో ఇష్టమని, దూకుడుగా ఆడతానని అన్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్లోనూ ఇదే సూత్రాన్ని అనుసరించనున్నట్లు చెప్పాడు.
క్రికెట్లో రాణించాలంటే తోటి ఆటగాళ్లతో కలిసి సమయాన్ని ఆస్వాదించడం చాలా ముఖ్యమని చెప్పాడు. రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, జితేష్ శర్మలతో సావాసం చాలా బాగుంటుందన్నాడు. క్రికెట్లో రాణించాలంటే ఫిట్గా ఉండాల్సిన అవసరాన్ని కూడా ఈ సందర్భంగా రింకూ సింగ్ నొక్కి చెప్పాడు.