Rohit Sharma in Trouble : భారత కెప్టెన్ రోహిత్ శర్మ చిక్కుల్లో పడినట్లుగా తెలుస్తోంది. దక్షిణాప్రికాతో రెండో టెస్టు మ్యాచ్ అనంతరం పిచ్పై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కేప్టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోపే ముగిసింది. ఈ మ్యాచ్లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా.. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఐసీసీ మ్యాచ్ రిఫరీల పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
భారత్కు వచ్చి ఆడేటప్పుడు ఇతరులు నోరు మూసుకుని ఉన్నంత వరకు ఇలాంటి పిచ్లపై ఆడేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అతను పేర్కొన్నాడు. ఐసిసి కపటత్వం, ద్వంద్వ ప్రమాణాలపై అతను పరోక్షంగా విరుచుకుపడ్డాడు. ‘కేప్టౌన్ టెస్ట్ మ్యాచ్లో ఏం జరిగిందో అందరూ చూశారు. ఇది కూడా క్రికెట్ పిచే కదా.. ఐసీసీకి, మ్యాచ్ రీఫరీలకు ఏం జరిగిందో కనబడిందనే అనుకుంటున్నా.’ అని రోహిత్ అన్నాడు.
ఈ పిచ్కు ఏ రేటింగ్ ఇస్తారని ప్రశ్నించాడు. భారత్లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ పిచ్ పై ఓ బ్యాటర్ సెంచరీ చేసిన కూడిన దానికి యావరేజ్ రేటింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. ఐసీసీ గానీ, మ్యాచ్ రిఫరీలు గానీ తటస్థంగా ఉండాలన్నాడు.
కాగా.. రోహిత్ చేసిన వ్యాఖ్యలపై ఐసీసీ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే.. రోహిత్ పై చర్యలు తీసుకునేందుకు ఐసీసీ సిద్ధమవుతుందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అదే జరిగితే రోహిత్ శర్మపై నిషేదం లేదా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. భారత జట్టు అఫ్గానిస్తాన్తో సిరీస్ కోసం సిద్దమవుతోంది. జనవరి 11న మొహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో సిరీస్ ఆరంభం కానుంది. ఇప్పటికే రెండు దేశాలు తమ తమ జట్లను ప్రకటించారు. 14 నెలల తరువాత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20 జట్టులోకి వచ్చారు.