Team India
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు ముందు టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. గాయాల కారణంగా కొంత విరామం తీసుకున్న దీపక్ చాహర్ ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. అయితే.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు, నాలుగవ టీ20 మ్యాచులు ఆడిన చాహర్ అనూహ్యంగా ఐదో మ్యాచ్కు దూరం అయ్యాడు. అతడు మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఐదో మ్యాచులో ఆడడం లేదని మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. అయితే.. ఏం జరిగిందనే విషయం మాత్రం చెప్పలేదు.
ఈ విషయం పై దీపక్ చాహర్ తాజాగా స్పందించాడు. తన తండ్రిని అత్యవసరంగా ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చిందని తెలిపాడు. సరైన సమయంలో తన తండ్రిని ఆస్పత్రిలో చేర్పించామని, లేకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండేదన్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని చెప్పాడు. దీపక్ చాహర్ తండ్రి లోకేంద్ర సింగ్ బ్రెయిన్ స్ట్రోక్కు గురైయ్యారు.
ద్రవిడ్, సెలక్టర్లతో మాట్లాడా..
Deepak Chahar
తన తండ్రి ఆరోగ్యం కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని దీపక్ చాహర్ చెప్పాడు. తనను ఆటగాడిని చేసేందుకు ఎన్నో కష్టాలు పడినట్లు గుర్తు చేసుకున్నారు. తన తండ్రి బాగాలేదని తెలియడంతో వెంటనే ఇంటికి వెళ్లాను. అందుకనే ఐదో టీ20 మ్యాచుల్లో ఆడలేదని వివరించాడు. ఆయన ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడిన తరువాతే దక్షిణాఫ్రికా పర్యటనను వెళ్లనున్నట్లు చెప్పాడు. ఈ విషయం పై ఇప్పటికే కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు సెలక్టర్లతో మాట్లాడినట్లు చాహర్ తెలిపాడు.
మరికొద్ది రోజుల్లో టీమ్ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచుల సిరీస్లు ఆడనుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 10న జరగనున్న మొదటి టీ20 మ్యాచుతో ఈ పర్యటన ఆరంభం కానుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకోవడంతో వన్డేలకు కేఎల్ రాహుల్, టీ20లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.