Sourav Ganguly : లార్డ్స్లో టీమ్ఇండియా ఓటమిపై గంగూలీ కామెంట్స్..
లార్డ్స్లో భారత్ గెలవాల్సి ఉందని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు.
- Thota Vamshi Kumar
- Published On : July 16, 2025 / 12:32 PM IST
Sourav Ganguly Questions Top Order Failure After Lords Defeat
లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో భారత్ పై ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. అయితే.. ఈ మ్యాచ్లో భారత్ గెలవాల్సి ఉందని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. టాప్ఆర్డర్ మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే సిరీస్లో భారత్ ఆధిక్యంలో ఉండేదని అన్నాడు. టీమ్ఇండియా బ్యాటర్ల వైఫల్యం తీవ్ర నిరాశకు గురి చేసిందని అసహనం వ్యక్తం చేశాడు.
ఓ కార్యక్రమంలో గంగూలీ మాట్లాడుతూ.. భారత జట్టు ఓటమి తనను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. ఈ సిరీస్లో భారత బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే.. 193 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదిస్తారని అనిపించింది. ఓ వైపు జడేజా ఒంటరి పోరాటం చూసినప్పుడు మిగిలిన బ్యాటర్లు ఖచ్చితంగా నిరాశకు గురై ఉంటారన్నాడు.
Vaibhav Suryavanshi : చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ఈ సారి బ్యాట్తో కాదు బంతితో..
ఎందుకంటే సిరీస్లో ఇంగ్లాండ్ పై 2-1 ఆధిక్యం సాధించేందుకు ఇదో సువర్ణ అవకాశం అని, దాన్ని మిస్ చేసుకున్నారన్నాడు. ముఖ్యంగా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు తమ సామర్థ్యానికి తగ్గట్లుగా ఆడలేదనే విషయాన్ని గ్రహించి బాధపడి ఉండొచ్చునని తాను అనుకుంటున్నట్లు గంగూలీ చెప్పాడు. టాప్ ఆర్డర్లో ఒక్కరు రాణించినా ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించేదని అన్నాడు.
ఇక జడేజా గురించి మాట్లాడుతూ.. అతడు అసాధారణ ప్రదర్శన కనబరిచాడని గంగూలీ తెలిపాడు. అతడు ఇలా బ్యాటింగ్ చేస్తున్నంత కాలం తన కెరీర్ను కొనసాగించగలడని చెప్పాడు. అతడు చాలా కాలంగా జట్టులో ఉంటున్నాడు. దాదాపు 80 టెస్టులు, 200 వన్డేలు ఆడాడు. అతడికి ప్రత్యేకంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ గురించి చెప్పాల్సిన పని లేదన్నాడు. ప్రస్తుతం జట్టులో ఎంతో అనుభవం కలిగిన జడేజా కీలకంగా మారాడని చెప్పాడు.
