IND vs NZ 2nd T20: హార్ధిక్ సేనకు పరీక్ష.. నేడు ఇండియా వర్సెస్ కివీస్ రెండో టీ20 మ్యాచ్.. తుది జట్టులో రెండు మార్పులు?
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ లక్నో వేదికగా జరుగుతుంది. రాత్రి 7గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి టీ20 మ్యాచ్లో ఓటమిపాలైన హార్దిక్ సేనకు రెండో టీ20 మ్యాచ్లో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి. అయితే, ఈ మ్యాచ్కు తుది జట్టులో రెండుమార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది.
- Harishth Thanniru
- Published On : January 29, 2023 / 07:55 AM IST
India vs new zealand T20 Match
IND vs NZ 2nd T20: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్లలో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ లక్నో వేదికగా జరుగుతుంది. రాత్రి 7గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రాంచీలో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో హార్ధిక్ సేన ఆశించిన స్థాయిలో రాణించక పోవటంతో కివీస్ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్లో సిరీస్ను గెలుచుకోవాలంటే నేడు జరిగే మ్యాచ్ లో హార్ధిక్ సేన తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. అయితే, టీమిండియా తుది జట్టుపైనే అందరి దృష్టి ఉంది. తుది జట్టులో ఏమైనా మార్పులు చేస్తారా? మొదటి టీ20 జట్టునే కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
Ind Vs Nz 1st T20I : న్యూజిలాండ్తో తొలి టీ20లో భారత్ ఓటమి
టీమిండియా తుది జట్టులో రెండు కీలక మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇషాన్ కిషన్ స్థానంలో పృథ్వీ షాను తుదిజట్టులో ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఇషాన్ కిషన్ వరుస మ్యాచ్ లలో విఫలమవుతూ వస్తున్నాడు. గత ఏడాది జూన్ 14న టీ20 ఇంటర్నేషనల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తరువాత అతను పెద్దగా స్కోర్ చేసిన దాఖలాలు లేవు. మొదటి టీ20 మ్యాచ్ లోనూ పెద్దగా పరుగులేమీ చేయకుండానే ఇషాన్ పెవిలియన్ బాటపట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో పృథ్వీకి తుది జట్టులో అవకాశం దక్కేచాన్స్ ఉంది.
#IND vs NZ: ఆటలో ఇలాంటి ఓటమి సహజమే: వాషింగ్టన్ సుందర్
లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ దీపక్ హుడా విఫలమవుతున్నాడు. అతని స్థానంలో వికెట్ కీపర్, బ్యాటర్ జితేష్ శర్మను తుదిజట్టులోకి తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. జితేష్ శర్మ వేగంగా కొట్టడంలో దిట్ట. టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే అర్షదీప్ సింగ్ ఆందోళన కలిగిస్తున్నాడు. తొలి టీ20 మ్యాచ్లో ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అర్షదీప్ భారీగా పరుగులు ఇచ్చాడు. టీమిండియా ఓటమికి ఇదో కారణంగాకూడా చెప్పొచ్చు. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్, బౌలింగ్ తో రాణించాడు. కుల్దీప్ తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. టీమిండియాతో వన్డే సిరీస్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న కివీస్ జట్టు టీ20 మొదటి మ్యాచ్ లో విజయంతో ఫామ్ లోకి వచ్చింది. నేడు జరిగే మ్యాచ్ లోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవటం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని ఆ జట్టు ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. ఫామ్లోకి వచ్చిన కివీస్ను నిలువరించాలంటే హార్ధిక్ సేన బ్యాటింగ్, బౌలింగ్ లో సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది.
