భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్న వికాస్ కోహ్లీ కుమారుడు ఆర్యవీర్ కోహ్లీ పేరు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) రెండో సీజన్ డ్రాఫ్ట్ జాబితాలో ఉంది. వచ్చే జూలై 5న వేలం జరుగుతుంది.
ఆర్యవీర్ (15) లెగ్ స్పిన్నర్. విరాట్ చిన్నప్పటి కోచ్ రాజ్ కుమార్ శర్మ వద్ద వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో ఆర్యవీర్ శిక్షణ తీసుకుంటున్నాడు. గత ఏడాది ఢిల్లీ అండర్-16 జట్టులో ఆడటంతో అతడిని సీ కేటగిరీలో పెట్టారు.
ఇదిలా ఉండగా, భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరు కుమారులు ఆర్యవీర్, వేదాంత్ కూడా డ్రాఫ్ట్లో చోటు దక్కించుకున్నారు. పెద్ద కుమారుడు ఆర్యవీర్ ఢిల్లీ అండర్-19 తరఫున మేఘాలయపై 297 పరుగులతో రాణించాడు. సెహ్వాగ్ చిన్న కుమారుడు వేదాంత్ ఆఫ్ స్పిన్నర్గా ఢిల్లీ అండర్-16 జట్టులో ఆడాడు.
DPL 2024 టైటిల్ను ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ గెలుచుకుంది. ఫైనల్లో సౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్పై మూడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదటి సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసిన ప్రియాంశ్ ఆర్య, దిగ్వేశ్ రాథీ, ప్రిన్స్ యాదవ్ లాంటి యువ ఆటగాళ్లు IPL 2025కు ఎంపికయ్యారు.
గత సీజన్లో మొత్తం ఆరు జట్లు పోటీకి దిగగా ఈ సారి ఔటర్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ జట్లు కొత్తగా చేరుతున్నాయి. మొత్తం ఎనిమిది జట్లు ఈ సారి బరిలో ఉంటాయి.