WI vs IND 1ST Test : భారత్ భారీ స్కోర్.. విండీస్పై సెంచరీలతో చెలరేగిన ఓపెనర్లు.. UPDATES
డొమినికా వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో..
- Thota Vamshi Kumar
- Published On : July 13, 2023 / 08:00 PM IST
1st Test Day 2
శతక్కొట్టిన జైస్వాల్, రోహిత్ శర్మ..
తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలతో కదంతొక్కారు. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ శతకాలు నమోదు చేశారు. సెంచరీ చేసిన కాసేపటికే రోహిత్ శర్మ ఔటయ్యాడు. కెప్టెన్ రోహిత్ 221 బంతుల్లో 103 రన్స్ చేశాడు. అతడి స్కోర్ లో 10 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. మరో ఓపెనర్ జైస్వాల్ 215 బంతుల్లో సెంచరీ చేశాడు.
శుభ్ మన్ గిల్ తీవ్రంగా నిరాశపరిచాడు. 11 బంతుల్లో 6 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. 81 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఇప్పటివరకు భారత్ 95 పరుగుల లీడ్ లో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 150 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.
లంచ్ బ్రేక్.. టీమ్ఇండియా స్కోరు 146/0
రెండో రోజు ఆటలో తొలి సెషన్ ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 146 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (68), యశస్వి జైస్వాల్ (62) క్రీజులో ఉన్నారు. విండీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 4 పరుగుల వెనుకంజలో ఉంది భారత్. రోహిత్ శర్మ టెస్టుల్లో 3,500 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
రోహిత్ శర్మ అర్థశతకం
వెస్టిండీస్ బౌలర్లను సునాయసనంగా ఆడుతున్నారు భారత ఓపెనర్లు. మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తున్నారు. కార్న్వాల్ బౌలింగ్లో సింగిల్ తీసి భారత కెప్టెన్ రోహిత్ శర్మ 106 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇందులో నాలుగు ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
యశస్వి జైశ్వాల్ హాఫ్ సెంచరీ..
యశస్వి జైశ్వాల్ అదరగొడుతున్నాడు. అరంగ్రేటం టెస్టులోనే అర్ధశతకం బాదేశాడు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్లో ఫోర్ కొట్టి 104 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 7 ఫోర్లు ఉన్నాయి.
డొమినికా వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. తొలి రోజు వెస్టిండీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 150 పరుగులకే ఆలౌటైంది. భారత్ ఓవర్ నైట్ స్కోరు 80/0తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగిస్తోంది. క్రీజులో యశస్వి (40), రోహిత్ శర్మ (30) ఉన్నారు. భారత్ ఇంకా 70 పరుగులు వెనుకంజలో ఉంది.
