India Vs Pakistan Representative Image (Image Credit To Original Source)
India Vs Pakistan: టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ తో మ్యాచ్ విషయంలో పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. భారత్ తో జరిగే లీగ్ దశ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మరింత దెబ్బతిన్నాయని చెప్పాలి.
ఫిబ్రవరి 7న టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి. పాకిస్తాన్ తన అన్ని మ్యాచ్లను శ్రీలంకలోనే ఆడనుంది. ఇక లీగ్ దశలో ఫిబ్రవరి 15న భారత్తో తలపడాల్సి ఉంది. ఇంతలోనే షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక షాకింగ్ ప్రకటన చేసింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో మెన్ ఇన్ బ్లూతో జరగాల్సిన గ్రూప్ మ్యాచ్ ను బాయ్ కాట్ చేసింది. పాక్ క్రికెట్ జట్టు భారత్ తో ఆడేది లేదని తేల్చి చెప్పింది.
మెన్స్ క్రికెట్ సంగతి అలా ఉంటే.. ఇప్పుడు అందరి దృష్టి ఉమెన్స్ క్రికెట్ పై పడింది. ఫిబ్రవరి 13 నుండి ఫిబ్రవరి 22 వరకు బ్యాంకాక్లో జరగనున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్లో పాకిస్తాన్ మహిళల A జట్టు భారత A జట్టుతో ఆడుతుందా లేదా అనే దానిపై చర్చ మొదలైంది. ఈ టోర్నమెంట్లో భారత్ A , పాకిస్తాన్ A జట్లు గ్రూప్ Aలో ఉన్నాయి. ఫిబ్రవరి 15న బ్యాంకాక్లోని టెర్డ్థాయ్ క్రికెట్ గ్రౌండ్లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
క్రికెట్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. పాకిస్తాన్ మహిళల A జట్టు ఫిబ్రవరి 15న భారత జట్టుతో ఆడనుందని తెలుస్తోంది. ఎందుకంటే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్లో ఇప్పటివరకు ఇండియా A తో మ్యాచ్ కు సంబంధించి పాక్ టీమ్ కి ఎటువంటి సూచనలు అందలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఫిబ్రవరి 1న మహిళల టోర్నమెంట్ కోసం జట్టును ప్రకటించింది. అదే రోజున మెన్స్ T20 ప్రపంచ కప్లో భారత్ తో మ్యాచ్ ను బహిష్కరించాలని తమ దేశ క్రికెట్ జట్టును పాక్ ప్రభుత్వం ఆదేశించింది.
అదే సమయంలో తమ జట్టు గ్రూప్ Aలో భారత జట్టుతో లిస్ట్ చేయబడిందని చెప్పడమే కాకుండా మ్యాచ్ తేదీని కూడా ప్రస్తావించింది. గ్రూప్ ఏ లో పాకిస్తాన్, భారత్, UAE, నేపాల్ జట్లు ఉన్నాయి. గ్రూప్ Bలో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, ఆతిథ్య థాయిలాండ్ జట్లు ఉన్నాయి. ఒక్కో జట్టు మూడు మ్యాచులు ఆడనుంది. గ్రూప్ లో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్స్ ఆడతాయి.