సరిదిద్దాడు: మార్ష్‌పై ధోనీ వ్యూహం పనిచేసిందిలా..(వీడియో)

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు గుప్పించినా వికెట్ కీపింగ్‌లో మాత్రం ఎవ్వరూ వేలెత్తి చూపలేకపోయారు. వేగాన్ని ఏ మాత్రం తగ్గించుకోకుండా చురుకుగా కనిపించే ధోనీ శుక్రవారం ఆటలో చేసిన పొరబాటు పెద్ద దుమారాన్ని లేపింది. మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఓ సులువైన క్యాచ్‌ని జారవిడిచాడు ధోనీ. కానీ, కాసేపటికే ఆ పొరబాటును చురుకైన స్టపింగ్‌తో ధోనీ సరిదిద్దుకున్నాడు. 

ఆసీస్ ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్ కేదర్ జాదవ్ బౌలింగ్‌ చేస్తున్నాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న షాన్ మార్ష్ బంతిని కట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. బ్యాడ్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా ధోనీ చేతుల్లోకి వెళ్లింది. బంతి బౌన్స్ అవడంతో దానిని చేతులలో నిలుపుకోలేకపోయాడు. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో సెంచరీ బాది ఫామ్‌లో ఉన్న షాన్ మార్ష్.. వికెట్ చేజారింది. దీంతో బౌలర్ కేదార్ జాదవ్‌తో పాటు కెప్టెన్‌ కోహ్లీ సైతం నిరాశను వ్యక్తం చేశారు. 

తప్పును సరిదిద్దుకునే క్రమంలో ఇన్నింగ్స్ 24వ ఓవర్‌లో షాన్ మార్ష్‌ని ఔట్ చేసేందుకు చాహల్‌తో కలిసి వ్యూహాన్ని రచించాడు. దానికి కారణం స్పిన్నర్ల బౌలింగ్‌లో మార్ష్ అస్తమానం క్రీజు వెలుపలికి వెళ్లి షాట్ కోసం ప్రయత్నిస్తుండటమే. ఈ క్రమంలోనే చాహల్‌కి సూచనలు చేసిన ధోనీ.. లెగ్‌సైడ్ వైడ్‌ రూపంలో బంతిని విసరాల్సిందిగా సూచించాడు. ఈ ప్లాన్‌ని అర్థం చేసుకోలేని షాన్ మార్ష్ ఉచ్చులో పడ్డాడు. క్రీజు వెలుపలికి వెళ్లి వైడ్‌ రూపంలో వచ్చిన బంతిని అందుకుంటుండగా ధోనీ స్టంపౌట్ చేశాడు. 

 

దీంతో.. 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్ష్ ఔటయ్యాడు. సిడ్నీ, అడిలైడ్‌లో జరిగిన రెండు వన్డేల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించిన ధోనీ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.