Pothula Sunitha : జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత
Pothula Sunitha : వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో పోతుల సునీత దంపతులు బీజేపీ కండువా కప్పుకున్నారు.
- Harishth Thanniru
- Published On : September 14, 2025 / 11:50 AM IST
Pothula Sunitha
Pothula Sunitha : వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో పోతుల సునీత దంపతులు బీజేపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన పోతుల సునీత.. ఏడాది క్రితం ఎమ్మెల్సీ పదవికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుత్వానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో చేరారు.
పోతుల సునీత 2017లో తొలిసారి టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, టీడీపీ నుంచి టికెట్ దక్కలేదు. దీంతో 2020 నవంబర్లో ఆమె తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామాచేసి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి పోటీచేసి మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఏడాది క్రితం వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా.. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో సునీత దంపతులు బీజేపీ కండువా కప్పుకున్నారు.
విశాఖపట్టణంలోని రైల్వే మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సారథ్య యాత్ర ముగింపు సభకు ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో బీజేపీ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. డబుల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో భౌగోళికంగా బీజేపీని ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికి కార్యకర్తలు, బాధ్యత తీసుకోవాలని, సమాజంలో ఉన్న ప్రతివర్గం వద్దకు వెళ్లాలని సత్యకుమార్ కోరారు. బీజేపీ అంటే అభివృద్ధిని కాంక్షించే పార్టీ అని. రాష్ట్రంలో పార్టీ ఎంతో బలోపేతమైందని, అందుకే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశాఖపట్టణం సభకు వచ్చారని సత్యకుమార్ అన్నారు. ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో 2030 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోందని అన్నారు.
