Yuvraj Singh-Hardik Pandya
Yuvraj Singh-Hardik Pandya : స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ను తృటిలో చేజార్చుకున్న టీమ్ఇండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2024 పై దృష్టి పెట్టింది. ఈ ఏడాది జూన్లో వెస్టిండీస్, అమెరికాలు పొట్టి ప్రపంచకప్కు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే.. ఆ మెగాటోర్నీలో భారత జట్టును నడిపించే నాయకుడు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 14 నెలల తరువాత రోహిత్ శర్మ టీ20 జట్టులోకి వచ్చాడు. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్య టీ20ల్లో టీమ్ఇండియాకు సారథ్యం వహించాడు. ఈ క్రమంలో కెప్టెన్సీ పై భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీ20 ప్రపంచకప్లో భారత జట్టును ఎవరు నడిపిస్తారు అనే ప్రశ్నపై యువరాజ్ స్పందించాడు. హార్దిక్ పాండ్య అవసరం టీమ్ఇండియాకు ఉందన్నాడు. వన్డే ప్రపంచకప్లో పాండ్య గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నారు. అతడు పూర్తిగా కోలుకునేందుకు సమయం ఇవ్వాల్సిన అవసరం యువీ అభిప్రాయపడ్డాడు. అతడు కుదురుకున్న తరువాత అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఆశించాలన్నాడు.
ఇక కెప్టెన్సీ విషయానికి వస్తే.. ఎక్కువ ఆప్షన్లు ఉంటే చాలా మంచిదన్నాడు. సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్లను ఆప్షన్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే టీమ్ఇండియా కెప్టెన్గా సూర్య బాధ్యతలు నిర్వర్తించాడు. అటు ఐపీఎల్లో గిల్ సారథ్య బాధ్యతలు అందుకోనున్నాడు అని యువీ అన్నాడు.
రోహిత్ అద్భుతమైన కెప్టెన్..
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై యువీ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ అద్భుతమైన నాయకుడని కితాబిచ్చాడు. ఎందుకంటే అతడు ఐదు ఐపీఎల్ ట్రోఫీలను సాధించాడు. అంతేకాదు వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియాను ఫైనల్కు తీసుకువెళ్లాడని చెప్పాడు. ఇక 14 నెలల తరువాత టీ20ల్లో రోహిత్ పునరాగం చేయడం పై మాట్లాడుతూ.. మూడు ఫార్మాట్లలో ఆడితే పని భారం అధికంగా ఉంటుందని, ఈ విషయంలో రోహిత్ జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.
ఇక రోహిత్, కోహ్లీలు టీ20ల్లో పునరాగమనం చేయడం ఎంతో ఆనందాన్ని కలిగిందన్నాడు. వీరు ఇలా చేయడం వల్ల యువ ఆటగాళ్లకు అవకాశాలు రావని కొందరు అంటున్నారని, అయితే.. ఈ దిగ్గజ ఆటగాళ్లను విస్మరించలేమని యువీ అన్నాడు.
Mohammad Rizwan : టీ20ల్లో రిజ్వాన్ అరుదైన రికార్డు.. సిక్సర్ల మోత..