×
Ad

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!

తమ రిటైర్మెంట్‌ వయసును పొడిగించకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని వైద్యులు ఆమెను డిమాండ్ చేసినట్టు సమాచారం.

  • రిటైర్మెంట్ ఏజ్ పెంపు పేరుతో వసూళ్లు..!?
  • రిటైర్మెంట్ ఏజ్ పెంచుతామని డాక్టర్లకు కుచ్చుటోపి
  • డబ్బులు వసూలు చేసిన కీలక విభాగాధిపతి సతీమణి!

రిటైర్మెంట్ వయసు పొడగించేందుకు 3 కోట్ల రూపాయలు. తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఇప్పుడీ అంశం కలకలం రేపుతోంది. ఉద్యోగ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచేలా ఫైల్కదిలిస్తానంటూ పలువురు డాక్టర్లను మరో వైద్యురాలే బురిడీ కొట్టించినట్లు జరుగుతున్న చర్చ హాట్ టాపిక్‌గా మారింది.

రాష్ట్ర వైద్యశాఖలోని ఓ కీలక అధికారి సతీమణి రిటైర్మెంట్ ఏజ్ పెంపు పేరుతో వసూళ్లకు తెరతీశారనే ప్రచారం జరుగుతోంది. సదరు శాఖలో డిప్యుటేషన్‌పై వచ్చి చాలా ఏళ్లుగా అక్కడే పాతుకుపోయిన ఓ జిత్తులమారి అధికారి ఈ వసూళ్ల దందాను ముందుండి నడిపినట్టు తెలుస్తోంది. అయితే డబ్బులు తీసుకుని కూడా ఏజ్ పెంచకపోవడం.. ఫైల్ పెండింగ్‌లోనే పడిపోవడంతో బాధిత వైద్యులు ఆందోళనకు సిద్ధమవుతుండటం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ పరిధిలో నిబంధనల మేరకు టీచింగ్‌ స్టాఫ్‌ 65 ఏళ్లకు, నాన్‌ టీచింగ్ స్టాఫ్‌ 61 ఏళ్లకు రిటైర్ అవుతారు. ఈ విభాగం మాదిరిగానే తమ డిపార్ట్మెంట్లో కూడా రిటైర్మెంటక్‌ వయసు 65 ఏళ్లకు పెంచుతామని డాక్టర్లకు కీలక విభాగాధిపతి భార్య ఆశ చూపినట్లు చెబుతున్నారు. డాక్టర్ల రిటైర్మెంట్‌ వయసు పెంపునకు స్వయంగా ఆమె హామీ ఇవ్వడంతో నమ్మిన చాలామంది డాక్టర్లు ఆమె అడిగినంత ముట్టజెప్పారట.

Also Read: చర్చిద్దాం రండి.. అటెండెన్స్‌ మ్యాటర్స్‌.. స్పీకర్‌ పిలుపు..! రైట్‌ టు రీకాల్‌ అంటూ వార్నింగ్

సాధారణంగా మంత్రివర్గం ఆమోదం, గవర్నర్ అనుమతి, ప్రభుత్వ ప్రత్యేక ఉత్తర్వులు ఉంటేనే ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు పెంపు జరుగుతుంది. కానీ వైద్యారోగ్య శాఖ పెద్దలంతా తన భర్త కనుసన్నల్లో ఉన్నారని, ప్రభుత్వంతో మాట్లాడి జీవో జారీ అయ్యేలా చేస్తానని వైద్యులను ఆ కీలక విభాగాధిపతి సతీమణి నమ్మించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆమె అక్రమంగా వసూళ్లు చేసిందా?
గత ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో సదరు విభాగాధిపతి సతీమణి ఈ అక్రమ వసూళ్లు చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో రిటైర్మెంట్ వయసు పెంపును ఆశించిన వైద్యులంతా వాట్సప్ గ్రూపు పెట్టుకుని.. తాము ఒక్కొక్కరు ఎంత డబ్బులు ఇవ్వాలన్నదానిపై చాట్ చేసుకున్నారట. ఇలా అందరి దగ్గర వసూలు చేసిన డబ్బులన్నింటినీ ఎవరికి ఇవ్వాలో వారికి ఇచ్చేశానని..వారు హ్యండ్ ఇచ్చారని సదరు కీలక విభాగాధిపతి సతీమణి చెప్తున్నట్లు తెలుస్తోంది.

ఇంతలోనే కీలక విభాగాధిపతి భార్యతో పాటు పలువురు వైద్యులు వరుసగా ఉద్యోగ విమరణ చేస్తున్నారు. దీంతో తమ రిటైర్మెంట్‌ వయసును పొడిగించకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని వైద్యులు ఆమెను డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇద్దరు ముగ్గురు డాక్టర్లు డబ్బుల కోసం సీరియస్‌గా ఒత్తిడి తీసుకురావడంతో వాళ్లకు మాత్రం విభాగాధిపతి భార్య ఎంతో కొంత ముట్టజెప్పి, మిగతా వారికి ముఖం చాటేసినట్టు చెబుతున్నారు.

ఈ వ్యవహారంలో వైద్యారోగ్య శాఖలోని కొందరు పెద్దలకు కూడా కొంత డబ్బు ముట్టజెప్పినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సదరు విభాగాధిపతి కూడా మరి కొన్ని రోజుల్లో రిటైర్ కానుండటంతో ఆయన భార్యకు డబ్బులు చెల్లించిన బాధిత వైద్యులంతా ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ నోటా ఈ నోటా ఈ విషయం వైద్య ఆరోగ్య శాఖలో దావానంలా వ్యాపించడంతో డబ్బులు దండుకున్న పెద్దలంతా తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ అయిపోతున్నారట.