Telangana- Forward Bloc: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (All India Forward Bloc Party) టికెట్ ఆశించే ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల నుంచి ఛాన్స్ దక్కని వారంతా.. ఫార్వర్డ్ బ్లాక్ టికెట్స్ పై పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వారు.. BRS, కాంగ్రెస్, BJP పార్టీ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తున్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపేందుకు ఫార్వర్డ్ బ్లాక్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే BRS నుంచి టిక్కెట్ దక్కని చాలామంది ఆశావహులు సింహం పార్టీ సింబల్ (Lion Symbol) కావాలంటూ మంతనాలు జరుపుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం (Katakam Mruthyunjayam) బీజేపీకి రాజీనామా చేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎలక్షన్ కమిటీ ఛైర్మన్గా భాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు BRSకు గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ (Arepally Mohan) త్వరలోనే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. చొప్పదండి BJP టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి సుద్దాల దేవయ్య (Suddala Devaiah) లైన్లో ఉన్నారని సమాచారం. రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారయణ (Somarapu Satyanarayana) ఈ పార్టీ నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కమలం నేతల్లో సఖ్యత లేకపోవడమే కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు ప్రత్యర్ధిగా బరిలో నిలిచేందుకు.. బీఆర్ఎస్ నేత, పాలకుర్తి ZPTC కందుల సంధ్యరాణి (Kandula Sandhya Rani) ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంథని నియోజకవర్గంలోని కాటారం సింగిల్ విండో ఛైర్మన్ చల్లా నారయణ రెడ్డి, పెద్దపల్లి నుంచి నల్ల మనోహర్ రెడ్డి BRS రెబల్స్గా సింహం గుర్తుపై పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య.. ఫార్వర్డ్ బ్లాక్ నేతలతో మాట్లాడినట్లు సమాచారం. హుస్నాబాద్ కాంగ్రెస్ టికెట్ దక్కకపోతే ప్రవీణ్ రెడ్డి ఈ పార్టీ నుంచి పోటి చేసే యోచనలో ఉన్నారు.
Also Read: మైనంపల్లి వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏంటి.. ప్లాన్ బీ రెడీనా?
టికెట్ వస్తుందో రాదో అని భావిస్తున్న నేతలు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీపై ఆశలు పెట్టుకున్నారు. ఈ పార్టీకి పెద్దగా క్యాడర్ లేకపోయినప్పటికీ.. సింహం సింబల్ ఆ పార్టీకి పొలిటికల్ క్రేజ్ను ఇస్తోంది. మూడు ప్రధాన పార్టీల తర్వాతి స్థానంలో నిలుస్తోంది. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటుతామని చెబుతున్నారు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి.
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1938 మే 3న స్థాపించారు. పార్టీ సింబల్ బెంగాల్ టైగర్ కాగా.. ఎలక్షన్ సింబల్ మాత్రం సింహం. ఇలా రెండు సింబల్స్తో ప్రత్యర్థులను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ టెన్షన్ పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందనేది ఆసక్తిగా మారింది.
Also Read: మహిళా రిజర్వేషన్ కోసం నా సీటు పోయినా పర్వాలేదు : మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు