Assembly Elections 2023: తెలంగాణ కాంగ్రెస్లో పెరిగిన అసంతృప్తులు.. పార్టీకి హ్యాండ్ ఇచ్చిన మరో ఇద్దరు కీలక నేతలు
రేవంత్ రెడ్డి మద్దతు ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నారు. టికెట్ రాదని తేలడంతో పార్టీకి గుడ్ బై చెప్పేందుకు..
- T Venkateshwarlu
- Published On : October 14, 2023 / 05:17 PM IST
Singireddy-Somasekhar Reddy
Singireddy Somasekhar Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సిద్ధం చేసుకుంటోన్న వేళ ఆ పార్టీకి కీలక నేతలు వరుసగా షాక్ ఇస్తున్నారు. ఆ పార్టీలో అసంతృప్తులు పెరిగిపోతున్నారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి సన్నిహితుడు సోమశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది.
సోమశేఖర్ రెడ్డి ఉప్పల్ టికెట్ ను ఆశించారు. అయితే, తనకు రేవంత్ రెడ్డి మద్దతు ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నారు. టికెట్ రాదని తేలడంతో పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డితో పాటు ఆయన భార్య, ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో తెలంగాణలో ఆ పార్టీలో ఇటీవల భారీగా చేరికలు జరిగాయి. తెలంగాణ ఎన్నికలకు త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనుంది.
ఈ సమయంలో ఇటీవలే మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అభ్యర్థులను ఇంకా ప్రకటించకముందే కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
