Bandi Bhagirath : బండి భగీరథ్ కేసు.. హైకోర్టులో దక్కని ఊరట.. అలా చేయలేమని తేల్చిచెప్పిన కోర్టు
Bandi Bhagirath : బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో దాఖలైన ముందస్తు బెయిల్ పిటీషన్పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం రాత్రి విచారణ జరిగింది.
- Harish Thanniru
- Updated on- May 16, 2026 / 08:37 AM IST
Bandi Bageerath
- బండి భగీరథ్పై పోక్సో కేసు
- మధ్యంతర బెయిల్ ఇవ్వలేమన్న హైకోర్టు
- అరెస్ట్ నుంచి రక్షణకు అభ్యర్థించినా నిరాకరణ
Bandi Bhagirath : బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో దాఖలైన ముందస్తు బెయిల్ పిటీషన్పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం రాత్రి విచారణ జరిగింది. పిటిషన్పై విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అనంతరం హైకోర్టు ఈ కేసుపై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పరిస్థితిలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించింది. ఈనెల 21న ఉత్తర్వులిస్తామని స్పష్టం చేసింది.
పోక్సో కేసులో ముందస్తు బెయిలు మంజూరు పిటిషన్పై జస్టిస్ టి. మాధవీదేవి విచారణ చేపట్టారు. శుక్రవారం రాత్రి 12గంటల వరకు సుదీర్ఘంగా విచారణ ప్రక్రియ సాగింది. ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలువిన్న అనంతరం.. బాలిక వాంగ్మూలం పరిశీలించిన తరువాత ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
బండి భగీరథ్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. తుదితీర్పు వెలువడే వరకైనా పిటిషనర్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని, దర్యాప్తు సహకరిస్తామని, కనీసం యథాతథస్థితినైనా కొనసాగించేలా ఉత్తర్వులివ్వాలంటూ అభ్యర్థించారు. న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. వచ్చేవారం వరకు ఆగకుండా వీలైనంత త్వరగా తీర్పు ఇవ్వాలన్న పిటిషనర్ న్యాయవాది అభ్యర్థనపై పరిశీలిస్తామంటూ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.
విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ.. బాలిక పదో తరగతితో సహా వివిధ పాఠశాలల్లో చదివిన సర్టిఫికెట్లు, జీహెచ్ఎంసీ రికార్డుల ఆధారంగా ఆస్పత్రి నుంచి ధ్రువీకరణ పత్రాలను పోలీసులు సేకరించారని, ఆమె వాస్తవ జనన తేదీ 2008 ఆగస్టు 12వ తేదీగా పోలీసుల దర్యాప్తులో తేలిందని తెలిపారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. బాధితురాలి వయస్సు 18ఏళ్లలోపే ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
