Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల ఎదుట విచారణకు హాజరైన యాంకర్ శ్యామల
బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
- Harishth Thanniru
- Published On : March 24, 2025 / 10:00 AM IST
Anchor Shyamala
Anchor Shyamala: బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పోలీసులు శ్యామలను విచారిస్తున్నారు.
ఇదిలాఉంటే.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరుతూ ఇటీవల తెలంగాణ హైకోర్టులో శ్యామల పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని శ్యామలకు కోర్టు సూచించింది. దీంతో ఆమె పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మందిపై కేసు నమోదైంది. వీరిలో టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు విచారించారు. అయితే, విష్ణుప్రియ, రీతూచౌదరి ఈనెల 25న మళ్లీ విచారణకు రావాలని పోలీసులు సూచించారు. తాజాగా.. సోమవారం నటి, యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వీరితోపాటు సన్నీ, అజయ్, సుధీర్ ఎప్పుడైనా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్ ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం. వీరికోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు బెట్టింగ్ యాప్స్ విషయంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ లోనూ పలువురిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, మంచులక్ష్మీ, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల, శోభాశెట్టి, సిరి హన్మంతు, శ్రీముఖి ఉన్నారు. తొలుత బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, మీడియేటర్లను విచారించిన తరుత సెలబ్రిటీలను విచారణకు పిలుస్తారని సమాచారం.
