Breakfast: విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ పై దృష్టి సారించాలన్నారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలన్నారు.
ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతోపాటు మంచి వాతావరణం ఉండేలా చూడాలన్నారు. ఇందుకు విద్యాశాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించాలని సూచించారు. సరైన సౌకర్యాలు లేని స్కూల్స్ ను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
నర్సరీ నుంచి 4వ తరగతి వరకు నూతన స్కూల్స్ ను పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించాలన్నారు. అక్కడ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అన్ని వసతులతో విద్యను అందించే ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 2026 జూన్ లో అకడమిక్ ఇయర్ నుంచి అమలు జరిగేలా యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లాలన్నారు.