Challan Pending traffic police seize vehicle hyderabad madhapur : ఈ వార్త వాహనదారులకు వార్నింగ్ అనే చెప్పాలి. ఇకపై వాహనదారులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. చలానాల విషయంలో అలసత్వం, నిర్లక్ష్యం అస్సలు తగదు. వెంటనే చలానాలు కట్టేయాల్సిందే. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. హైదరాబాద్ లో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం.
ఒక్క చలానా పెండింగ్ లో ఉన్నా నిబంధనల ప్రకారం వాహనాన్ని సీజ్ చేయొచ్చట. ఈ విషయాన్ని మాదాపూర్ ట్రాఫిక్ సీఐ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఆదివారం పర్వత్ నగర్ చౌరస్తాలో నిఖిలేష్ అనే న్యాయవాది బైక్ ను ఈ విధంగానే సీజ్ చేశారు.
ఒక చలానా పెండింగ్ ఉందని మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు బైక్ ని సీజ్ చేశారు. కూకట్పల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న నిఖిలేష్ తొగరి బైకును ఆదివారం పర్వత్నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఆ బైకుపై రూ.1650 చలానా పెండింగ్ ఉందని, చెల్లించాలని ఎస్ఐ మహేంద్రనాథ్ కోరారు. చలనా కట్టేందుకు న్యాయవాది నిరాకరించారు. దీంతో పోలీసులు బైక్ ను సీజ్ చేశారు. ఒక్క చలానాకే బండిని ఎలా సీజ్ చేస్తారని న్యాయవాది నిలదీశారు. దీనిపై మాదాపూర్ ట్రాఫిక్ సీఐ వివరణ ఇచ్చారు. రూల్స్ ప్రకారమే బండి సీజ్ చేశామని స్పష్టం చేశారు. ఒక్క చలానా పెండింగ్ ఉన్నా వాహనాన్ని సీజ్ చేయొచ్చని తెలిపారు.
సో, వాహనదారులు బీ అలర్ట్. చలానాలు కట్టకపోతే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. చాలామంది చలాన్లు పెండింగ్ లో ఉన్నా కేర్ లెస్ గా ఉంటున్నారు. కొన్ని వాహనాలపై వందల సంఖ్యలో చలాన్లు పెండింగ్ లో ఉండటం చూశాం. కానీ ఇక ముందు జాగ్రత్త. మీ బండిపై ఏవైనా చలాన్లు పెండింగ్ లో ఉన్నాయేమో చెక్ చేసుకోండి. వెంటనే వాటిని క్లియర్ చేసుకోవడం బెటర్.