Alleti Maheshwar Reddy : రైతు ఘోష – బీజేపీ భరోసా.. తెలంగాణ రాజకీయాల్లో మహేశ్వర్ రెడ్డి పెంచిన వేడి, మారిన సమీకరణాలు!
Alleti Maheshwar Reddy : మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రైతు ఘోష- బీజేపీ భరోసా యాత్ర తెలంగాణ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని.. దిగి వచ్చేలా చేసింది.
- Dharani Pilli
- Updated on- May 31, 2026 / 12:44 PM IST
changing Political Equations in Telangana After Maheshwar Reddy Successful Rythu Ghosha BJP Bharosa Yatra
Alleti Maheshwar Reddy : తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ తర్వాత, రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన ‘రైతు ఘోష – బీజేపీ భరోసా యాత్ర’ అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. నాలుగు రోజుల పాటు సాగిన ఈ యాత్ర.. ఊహించిన దానికంటే.. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న అధికార పక్షాన్ని తీవ్రంగా భయపెట్టడంలో విజయవంతమైంది. ఒక ప్రతిపక్ష నేత చేసే యాత్ర ఎంతవరకు ప్రభావం చూపించిందో చెప్పడానికి ప్రభుత్వ స్పందనే కొలమానం. మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్ర సృష్టించిన ప్రభావం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ యాత్ర ప్రభావంతో కాంగ్రెస్ సర్కార్.. “తడిసిన ధాన్యాన్ని కూడా కొంటాం” అని అధికారికంగా ప్రకటించడం చూస్తే… మహేశ్వర్ రెడ్డి గురి పక్కాగా తగిలిందని అర్థమవుతోంది. యాత్ర సందర్భంగా మహేశ్వర్ రెడ్డి విసిరిన సవాల్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. “రాష్ట్రంలో 80 శాతం ధాన్యం కొనుగోళ్లు జరిగాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దమ్ముంటే ఎక్కడ జరిగాయో చూపించండి, నేను నిరూపించడానికి సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇప్పుడే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి… ఆయన గెలిస్తే నేను రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటా!” అంటూ మహేశ్వర్ రెడ్డి విసిరిన పొలిటికల్ ఛాలెంజ్ కాంగ్రెస్ శ్రేణులను ఆత్మరక్షణలో పడేసింది.
ఈ యాత్రకు బీజేపీ అగ్ర నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దక్కకపోయినప్పటికీ.., మహేశ్వర్ రెడ్డి తన వ్యక్తిగత సామర్థ్యంతో, అందరినీ కలుపుకుపోయే (Inclusive) మనస్తత్వంతో ఈ కార్యక్రమాన్ని విజయతీరాలకు చేర్చారు. అలాగే నిస్తేజంగా ఉన్న గ్రౌండ్ కేడర్ను యాక్టివ్ చేసి, రైతుల గుండెల్లోకి బీజేపీని తీసుకెళ్లడంలో మహేశ్వర్ రెడ్డి పూర్తిగా కృతకృత్యులయ్యారు.
బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం తన తదుపరి పూర్తి ఫోకస్ను తెలంగాణపైనే పెట్టబోతోందనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ కీలకమైన కార్యక్రమ బాధ్యతను హైకమాండ్ మహేశ్వర్ రెడ్డికి అప్పగించడం వెనుక అధిష్ఠానం ఏదైనా పెద్ద వ్యూహాన్నే అమలు చేసిందా? అనే టాక్ వినిపిస్తోంది. ఈ యాత్రను ఒక ‘టెస్టింగ్ గ్రౌండ్’ లాగా భావించిన అధిష్ఠానం… రాష్ట్రంలో పార్టీని పరుగులు పెట్టించడానికి మహేశ్వర్ రెడ్డే సరైన వ్యక్తి అని భావించి ఈ బాధ్యతలు అప్పగించిందా? అధిష్ఠానం నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. క్షేత్రస్థాయిలో ఉన్న లీడర్లందరినీ సమన్వయం చేసుకుంటూ ఆయన ఈ యాత్రను ఘన విజయం వైపు నడిపించారని పార్టీ భావిస్తోందా? దీనిపై రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? అంటూ రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ యాత్ర విజయం బీజేపీ క్యాడర్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
