Cm Revanth Reddy On Vikarabad Collector Incident (Photo Credit : Google)
Vikarabad Collector Incident : వికారాబాద్ కలెక్టర్ దాడి ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కలెక్టర్ పై దాడిని ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారు. ఇప్పటికే పలు పార్టీల నాయకులు, ఉద్యోగులు ఈ దాడిని తప్పుపట్టారు. తాజాగా దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కలెక్టర్ పై దాడిని తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ దాడి వెనుక ఎంత వారున్నా ఊచలు లెక్క పెట్టాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. దాడులు చేయించిన వారిని, చేసిన వారిని ఎవరినీ వదలము అని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఆయన బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఇలాంటి దాడులు బీఆర్ఎస్ పార్టీ నేతలపై జరిగితే కేటీఆర్ సమర్థిస్తారా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అధికారులపై దాడులను బీఆర్ఎస్ ఎందుకు ఖండించదు అని ఆయన ప్రశ్నించారు. దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారు..? అంటే దాడులను ప్రోత్సహించేందుకే పరామర్శలా? అని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు రేవంత్ రెడ్డి.
ఫార్ములా ఈ-రేస్ స్కామ్ పైనా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్కామ్ నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. తెలంగాణ గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అవినీతి పార్టీ అయిన బీజేపీని అంతం చేస్తామన్న కేటీఆర్.. ఇప్పుడు బీజేపీ నేతలను ఎలా కలుస్తున్నారని ప్రశ్నించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని చెప్పడం బీజేపీకి సహకరించినట్లు కాదా అని నిలదీశారు. అమృత్ టెండర్లలో అవినీతి జరగలేదని స్వయంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందుల ఉపేందర్ రెడ్డి చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు.