Young India Education: విధ్వంసమైన విద్యాశాఖ వికాసం వైపు.. విద్యార్థుల ఆత్మగౌరవమే మా ప్రాధాన్యమన్న సీఎం రేవంత్
తెలంగాణ విద్యార్థులు ఆత్మగౌరవంతో పాఠశాలల(Young India Education)కు వెళ్లేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
- V Santhosh Kumar
- Published on- June 19, 2026 / 08:40 PM IST
Cm Revanth reddy launches young india education kits distribution in hyderabad
- ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ ప్రారంభించిన రేవంత్.
- విద్యాశాఖకు బడ్జెట్లో భారీగా నిధులు.
- ఒకటో తేదీనే కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపు.
Young India Education: తెలంగాణ విద్యార్థులు ఆత్మగౌరవంతో పాఠశాలలకు వెళ్లేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి ఆయన ‘యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల(Young India Education)’ పంపిణీని ఘనంగా ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా గురుకుల విద్యార్థులకు 22 వస్తువులతో, వసతి గృహార్థులకు 10, సాధారణ పాఠశాల విద్యార్థులకు 7 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను అందజేస్తున్నారు.
విద్యావ్యవస్థ ప్రక్షాళన – బడ్జెట్ నిధులు:
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్యాశాఖ తీవ్రంగా దెబ్బతిందని, ఆ విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించేందుకు నూతన ఎడ్యుకేషన్ పాలసీని తెచ్చామని సీఎం పేర్కొన్నారు. విద్యను భావితరాల పెట్టుబడిగా భావిస్తూ బడ్జెట్లో 8.5 శాతం నిధులు కేటాయించామన్నారు. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం రూ.26,600 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెరిగి ‘నో అడ్మిషన్’ బోర్డులు పెట్టే స్థాయికి మార్పు వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.
ఆత్మబలిదానాల రాష్ట్రం – విద్యార్థులకు భరోసా:
తెలంగాణ కేవలం పాలనా సౌలభ్యం కోసం ఏర్పడలేదని, విద్యార్థుల సుదీర్ఘ పోరాటాలు, ఆత్మబలిదానాల వల్లే సాధ్యమైందని రేవంత్రెడ్డి గుర్తుచేశారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని, అందుకే పాఠశాలల పునరుద్ధరణకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల జీతాల తరహాలోనే, ప్రతినెలా ఒకటో తేదీనే విద్యార్థులందరికీ కాస్మోటిక్ ఛార్జీలను నేరుగా చెల్లిస్తామని సీఎం కీలక భరోసానిచ్చారు.
