kottagudem bus accident (Image Credit To Original Source)
Bus Accident : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాలేజీ బస్సు బోల్తాపడింది. ఉదయం విద్యార్థులను కళాశాలకు తీసుకెళ్తున్న బస్సు మార్గం మధ్యలో లోయలో పడింది. ఈ ఘటనలో 40మంది విద్యార్థులకు గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు ప్రమాద సమయంలో 60 మంది విద్యార్థులు ఉన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట అటవీ ప్రాంతంలో ఎర్రమ్మ తల్లి గుడి వద్ద ఈ ఘటన జరిగింది. పాల్వంచకు చెందిన కేఎల్ఆర్ డిగ్రీ కళాశాల బస్సు మణుగూరు నుంచి పాల్వంచకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. స్టీరింగ్ పట్టేయడంతో అదుపు తప్పి లోయలో పడినట్లు డ్రైవర్ చెప్పాడు.
కాలేజీ బస్సు లోయలోపడిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఒక విద్యార్థిని చేయి బస్సు కింద ఇరుక్కుపోవడవంతో పోలీసులు వెలికి తీశారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.