Municipal Elections
Municipal Elections : ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర ఉత్కంఠ మధ్య జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. సోమవారం ఈ ఎన్నిక జరగాల్సి ఉండగా.. ఘర్షణల కారణంగా మంగళవారంకు వాయిదా పడింది. దీంతో ఇవాళ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. అయితే, ఈ ఎన్నిక ప్రక్రియలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Also Read : Prathyusha Case : సినీ నటి ప్రత్యూష మృతి కేసు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రెండు పిటీషన్లు కొట్టివేత
తొర్రూరు, జనగామ మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రెండు మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానానికి కాంగ్రెస్, బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లాటరీ పద్దతిలో ఎన్నిక నిర్వహణకు చర్యలు చేపట్టారు. లాటరీ ద్వారా రెండు చైర్మన్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు దక్కాయి.
జనగామ మున్సిపాలిటీ చైర్ పర్సన్గా కదకంచి బాలామణి (కాంగ్రెస్) లాటరీ పద్దతిలో ఎన్నికకాగా.. వైస్ చైర్మన్గా పర్వతాలు (బీఆర్ఎస్) ఎన్నికయ్యారు. తొలుత చైర్మన్ స్థానంకు ఎన్నిక నిర్వహించగా.. బీఆర్ఎస్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థికి 16 ఓట్లు చొప్పున వచ్చాయి. దీంతో అధికారులు లక్కీ డా వేశారు. ఇద్దరు పేర్లు రాసి డ్రా తీశారు. దీంతో లక్కీ డ్రాలో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి కదకంచి బాలమణిని అదృష్టం వరించింది.
తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ గా లాటరీ పద్దతి ద్వారా తుణం శ్రావణ్ (కాంగ్రెస్) ఎన్నిక కాగా.. వైస్ చైర్ పర్సన్గా సోమరజిని (కాంగ్రెస్) ఎన్నికయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడంతో రెండు రోజులుగా జరుగుతున్న నాటకీయ పరిణామాలు, ఉద్రిక్తతలకు తెరపడింది.